ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనపై ఇప్పుడే విమర్శలు చేయకూడదని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టుగా జేసీ చెప్పారు. ఇప్పుడు మనం మౌన వ్రతంలో ఉండాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. రాష్ట్రంలో పాలన మారాలని ప్రజలు కోరుకొన్నారని, చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత లేదన్నారు.

 

కానీ, అదే సమయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూడ తమను వైసీపీ, బీజేపీలో చేరాలని కూడ ఆహ్వానాలు అందినట్టుగా జేసీ తేల్చిచెప్పారు. కానీ పార్టీ మార్పుపై ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు.

 

రాష్ట్రంలో ఆయా పార్టీలను బలోపేతం చేసేందుకు నాయకత్వాలు పనిచేస్తున్నాయని ఈ క్రమంలోనే తమను ఆయా పార్టీలు సంప్రదించినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే తాను ఇంకా టీడీపీలోనే ఉన్నానని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాను నరేంద్రమోడీని చాలాసార్లు కలిసినట్టుగా జేసీ చెప్పారు. కానీ, ఏనాడూ కూడ అమిత్ షాను కలవలేదన్నారు. కొందరు బీజేపీ నేతలు తనను ఆ పార్టీలో చేరాలని కోరిన విషయాన్ని జేసీ ధృవీకరించారు.

 

చంద్రబాబునాయుడు పరిపాలనపై పెట్టిన శ్రద్ద పార్టీపై పెట్టలేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇదే విషయాన్ని తాను పలుమార్లు బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా చెప్పారు జన్మభూమి కమిటీలతో పాటు పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై పబ్లిక్ మీటింగ్‌లలో కూడ నిర్భయంగానే తాను చెప్పానన్నారు. చంద్రబాబునాయుడుతో ముఖాముఖి సమావేశాల్లో బాబు వ్యవహరిస్తున్న తీరుపై తాను బల్లచరిచి మాట్లాడినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: