2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్ సహాయంతో తాము అధికారంలోకి వచ్చినట్టుగా చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను దూరం చేసుకొన్నామన్నారు. బీజేపీని రాష్ట్రంలో దెబ్బతినేందుకు తమ పార్టీ కారణమైందన్నారు. కానీ, అదే సమయంలో తమ పార్టీ కూడ అధికారానికి దూరమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలో బలహీనమైన పార్టీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల రాజకీయంగా నష్టపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు లెక్కలు ఎక్కడో తప్పాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా విషయంలో పిల్లి మొగ్గలు వేయడం కూడ తమకు నష్టం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం నుండి రాబట్టాల్సిన నిధుల విషయంలో వెనక్కు వెళ్లలేదన్నారు. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను రాబట్టుకొనేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు కోటరీలో తాను ఉండేవాడినని సుజనా చౌదరి చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత తాను కేంద్ర మంత్రి పదవి రావడంతో ఎక్కువగా ఢిల్లీకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. 2014-19 మధ్యలో తాను చంద్రబాబు కోటరీలో లేనని చెప్పారు.
మనుషులతో కంటే, మిషన్లు చెప్పే మాటలను చంద్రబాబునాయుడు నమ్మారని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. సర్వేల మీద ఆధారపడ్డారన్నారు. పాలనపై కేంద్రీకరించి, పార్టీని పట్టించుకోలేదన్నారు. ఈ కారణాలతోనే పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమిని మూట గట్టుకొందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. మంగళగిరి నుండి పోటీ చేయడం లోకేష్ చేసిన తప్పు అని సుజనా చెప్పారు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు.
చంద్రబాబు ఒకే కులాన్ని పెంచిపోషించారనేది అవాస్తవమని సుజనా చెప్పారు. ఈ రకమైన విధానాన్ని బాబు ఏనాడూ ప్రోత్సహించరని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఈ విషయమై తప్పుడు ప్రచారం జరిగిందని సుజనా అభిప్రాయపడ్డారు. తాను కేంద్ర మంత్రిగా కాక ముందు కూడ తన కంపెనీలపై దాడులు జరిగాయన్నారు. 2004 తర్వాత తాను కంపెనీల వ్యవహరాల్లో తలదూర్చడం లేదన్నారు.తాను ఏ తప్పు చేయలేదన్నారు.