ఏపీలో తెలుగుదేశం పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీలో సంక్షోభం తలెత్తనుందా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నుంచి టీడీపీని బలవంతంగా లాక్కున్న చంద్రబాబు ఏకంగా 14 సంవత్సరాల పాటు సీఎం పీఠాన్ని వెలగబెట్టారు. అప్పటి నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నందమూరి ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లకుండా తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణతో పాటు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ను సైతం బాగా వాడుకున్నారు.
ఇక 2009 ఎన్నికల్లో తెలుగు ప్రజలు సూపర్ హీరో గా క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ ని సైతం చంద్రబాబు ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత ఎలా వదిలేశారో ప్రత్యక్షంగా చూశాం. ఇక తెలంగాణ ఎన్నికల్లో దివంగత నేత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని కూకట్పల్లిలో పోటీకి పెట్టి ఆమె ఓడిపోవడానికి కూడా చంద్రబాబు ప్రధాన కారణం అయ్యారు. ఇలా వీలున్నప్పుడల్లా నందమూరి ఫ్యామిలీ ని వాడుకుంటున్న చంద్రబాబు పార్టీ పగ్గాలను మాత్రం తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. దీనికి తోడు పార్టీ పగ్గాలను భవిష్యత్తులో తన తనయుడు లోకేష్కు అప్పగించాలనే గత రెండు సంవత్సరాలుగా ఎన్నో ఆపసోపాలు పడ్డారు. లోకేష్ను దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. చివరకు ఈ ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయారు. ఇది చంద్రబాబు కుంతంత్రమే అని చెప్పక తప్పదు.
ఈ ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చీలికలు తప్పవని చాలా మంది చెబుతున్నారు. పోసాని కృష్ణమురళితో పాటు మోత్కుపల్లి నర్సింహులు లాంటివాళ్ళు ఇప్పటికే పార్టీ పగ్గాలను నందమూరి ఫ్యామిలీ తీసుకుని చంద్రబాబును పార్టీ నుంచి బయటకు పంపేయాలని విమర్శించారు. ఇక ఇప్పుడు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చీలిపోబోతోందని ఆ పార్టీ నుంచి పలువురు నేతలు బిజెపితో సంప్రదింపులు జరుపుతున్నారని... వీలును బట్టి వీరిని తమ పార్టీలో చేర్చుకుంటామని బాంబు పేల్చారు.
ఇప్పటికే బీజేపీ నాయకత్వం కూడా ఏపీపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు ఇక్కడ టీడీపీని బద్నాం చేసి ఆ పార్టీ ప్లేస్లోకి రావాలని ఆపరేషన్ ఏపీ, టీడీపీ స్టార్ట్ చేసేసింది. ఈ క్రమంలోనే మాధవ్ ఏపీలో కొత్త రాజకీయం చూస్తారని ఈయన చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నిట్ట నిలువునా చీలిపోయి వీరిలో కొందరు వైసీపీ వైపు, మరి కొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక మిగిలిన టీడీపీలో కూడా కొందరు నారా నాయకత్వం పోయి నందమూరి నాయకత్వం రావాలని కోరుతున్నారు. ఏదేమైనా టీడీపీ వచ్చే ఐదేళ్లు పాటు ఏపీలో మనగడ సాగించడం సవాల్ లాంటిదే.