అమ్మ ఒడి.. జగన్ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావించిన నవరత్నాలు లోని ఓ అంశం. దీని ప్రకారం పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తానన్నది జగన్ హామీ. బడుగు బలహీన వర్గాల వారిని ఈ హామీ బాగా ఆకర్షించింది.
జగన్ కూడా సీఎం పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే అమ్మ ఒడి కార్యక్రమంపై ముఖ్యమంత్రి హోదాలో స్పందించారు. పిల్లవాడు ఏ బడిలో చేరినా.. ఏడాదికి 15 వేల రూపాయలు తల్లికి ఇస్తామని జగన్ చెప్పారు. అయితే అమ్మఒడి పథకం పై మెజారిటీ ప్రజలు విముఖంగా ఉన్నారని ఓ డిజిటల్ సంస్థ చేసిన సర్వేలో తేలింది.
ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల విషయంలో అమ్మ ఒడి పథకం మంచిదేనని ఈ సర్వేలో చాలా మంది అభిప్రాయపడ్డారట. కానీ ప్రైవేటు బడుల కు వెళ్ళే పిల్లలకు కూడా ఈ పథకం వర్తింపచేయటం ఏమి బాగాలేదని మెజారిటీ శాతం జనం అభిప్రాయపడ్డారట. ఈ సర్వేలో అభిప్రాయం ఎలా ఉన్నా అమ్మఒడి పథకం పై తగిన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, పప్పు బెల్లాల తరహాలో పంచి పెట్టకుండా సద్వినియోగం చేయాలన్నది చాలామంది అభిప్రాయం. అర్హులైన పేద పిల్లలకు సాయం చేయటం అందరూ ఆహ్వానిస్తారు.. కానీ అనర్హులకు కూడా సాయం చేస్తామనడం అపాత్రదానం చేయడమే అవుతుంది. ఈ పథకంపై ముందుకు వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.