ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి వివాదాస్పద రాజకీయ నేతగా చింతమనేని ప్రభాకర్ కొనసాగుతున్నారు. ఆడవారిపై చేయి చేసుకోవడం..కులం పేరుతో దూషించడం..ఇష్టానుసారంగా తన అనుచరులతో బెదిరింపులకు పాల్పపడటం ఇలా ఎన్నో అభియోగాలు ఆయనపై ఉన్నాయి. తాజాగా పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు.
మూడేళ్ల క్రితం అప్పటి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేసేందుకు పైపులను ఏర్పాటు చేసి నీటిని చెరువులకు మళ్లించారు. ఈ పైపులను అప్పట్లో ఆనాటి ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన రైతులు వేయించారు.
నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి చొప్పున రైతుల నుంచి చింతమనేని వసూలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత తాము పరిపాలనలో లేమన్న అక్కసుతో మవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి పైపులను చింతమనేని అనుచరులు తరలించుకుపోయారు. ఉన్నట్టుండి పైపులను తొలగించడంపై గ్రామస్థులు మండి పడుతున్నారు. కాగా, పైపులు తీసుకెళ్లిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో కేసిన సత్యనారాయణ అనే రైతు అందించిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు చింతమనేని ప్రభాకర్తోపాటు మరో ఐదుగురు దిరుసు సత్యనారాయణ, చిలకలపూడి నరేంద్ర, కమ్మ పకిరియ్య, గద్దే కిషోర్పై కేసు నమోదు చేశారు. చింతమనేనిని ఏ1గా చూపించారు. 420, 384, 431, రెడ్విత్ 34 ఐపీసీ, పీడీపీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.