ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మంగళవారం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ కు ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసారు.  దీంతో కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా  సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్‌ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. అనంతరం శాసన సభ్యులంతా డిప్యూటీ స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు.

 

వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే.. .బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.

 

అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్‌ స్పీకర్‌గా పని చేసారు. తాజాగా ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృధు స్వభావి అయిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారు.

 

గుంటూరు జిల్లాలో ఇప్పటికే సుచరితకి మంత్రి పదవి వరించింది.  అంతే కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రస్తుతం బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి దేవుటై స్పీకర్ పదవి కట్టబెట్టారు. దీంతో గుంటూరు జిల్లా వాసుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీ తమ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఇక 2024లో కూడా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: