గల్ఫ్ దేశాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్నాయి. అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా తప్పుకోవడంతో పాటు, ఇరాన్ పై ఆంక్షలు విధించింది. దీంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
గల్ఫ్ జలాల్లోని రెండు ఆయిల్ ట్యాంకర్లుపై దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఇరాన్ అని ఆరోపించింది. ఇక నిఘావ్యవస్థకు సంబంధించిన డ్రోన్ ను ఇరాన్ కూల్చివేయడంతో.. అమెరికా సీరియస్ అయ్యింది. ఇరాన్ పై బాంబుదాడులు చేస్తామని హెచ్చరించింది.
ఇందులో భాగంగా అమెరికన్ నావెల్ షిప్స్ గల్ఫ్ జలాల్లోకి ప్రవేశించాయి. ఇరాన్ ఏ మాత్రం బెదరకుండా.. తమపై ఒక్క తుపాకీ పేల్చినా నష్టం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తామేమి పసికూనలం కాదని హెచ్చరించింది. దీంతో అమెరికా ఒకడుగు వెనక్కి వేసి.. ఇరాన్ ఆర్మీకి సంబంధించిన కంప్యూటర్లను హ్యాక్ చేసి సమాచారాన్ని నిర్వీర్యం చేయాలని చేయాలని చూసింది.
అయితే, ఇరాన్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవేళ హ్యాక్ అయ్యి ఉంటె ఇరాన్ తీవ్రంగా స్పందించి ఉండేది. తాజాగా ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నాడు. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో గల్ఫ్ లో మరలా యుద్ధం వచ్చేలా కనిపిస్తోంది. ఇరాన్ బలహీనమైన దేశం ఏమి కాదు. బలమైన క్షిపణి వ్యవస్థ ఉంది. అణు వ్యవస్థను సొంతం చేసుకుంది. ఈ సమయంలో ఏదైనా తేడా వచ్చి యుద్ధం సంభవిస్తే.. అది వినాశనానికి దారి తీస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.