ప్రజల నుంచి వినతుల స్వీకరణ, కలెక్టర్ల సదస్సులు, ఇతర సమీక్షలకు వేదికైన ‘ప్రజా వేదిక’ కథ పరిసమాప్తమైంది. ‘ఇందులో ఇదే ఆఖరి సమావేశం. కలెక్టర్ల సదస్సు ముగియగానే దీనిని కూల్చివేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా...

 

మంగళవారం రాత్రి నుంచే ‘ప్రజా వేదిక’ కూల్చివేత ప్రారంభమైంది. మధ్యాహ్నం ఇదే మందిరంలో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష ముగియగానే... సీఆర్డీయే అధికారులు కూల్చివేత ఏర్పాట్లు మొదలుపెట్టారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి ఆనుకునే ప్రజా వేదికను నిర్మించిన సంగతి తెలిసిందే.

 

దీని కూల్చివేతపై టీడీపీ శ్రేణుల నుంచి నిరసనవ్యక్తమయ్యే అవకాశముండటంతో... ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 70 మంది సివిల్‌, మరో 70 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరకట్టను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీఆర్డీయే అధికారులు తొలుత ప్రజా వేదిక వెలుపల, లోపల ఏర్పాటు చేసిన పూల కుండీలను సచివాలయం వద్ద ఉన్న నర్సరీకి తరలించారు.

 

విద్యుత్తు సామగ్రిని, ఫర్నీచర్‌ను సచివాలయానికి చేర్చారు. రాత్రి 8 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో కూలీలు సమ్మెటలతో రంగంలోకి దిగా రు. 3 జేసీబీలు, 6 టిప్పర్లను తీసుకొచ్చారు. తొలుత ప్రజా వేదిక ముందు ఏర్పాటు చేసిన టెంట్‌లను కూల్చివేశారు. ఆ తర్వాత ‘ప్యాంట్రీ’ (టీ, కాఫీ తయారీ ప్రాంతం)ని నేలమట్టం చేశారు. ప్రహరీని కూల్చివేత కూడా మొదలుపెట్టారు. రాత్రి 11.15 గంటల సమయంలో ‘ప్రజా వేదిక’ ప్రధాన భవనం కూల్చివేత పనులు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: