ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణా నదీతీరంలోని ప్రజా వేదిక కూల్చివేతతో.. ప్రారంభమైన ఈ కూల్చివేత పర్వం... ఇప్పుడు విశాఖ మహానగరానికి చేరింది. జీవీఎంసీ పరిధిలోని అనేక అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది.
ముందుగా జోన్ టు పరిధిలోని జయభేరి ట్రూ వేల్యూ కార్ షోరూమ్ ను అధికారులు కూల్చివేశారు. ఇది తెలుగుదేశం మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందినది. ద్వారకా నగర్ లో మరో భవనాన్ని అధికారులు కూలుస్తున్నారు.
ఇది తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు చెందినది. కూలుస్తున్నవి రెండూ తెలుగుదేశం పార్టీ నేతలకే సంబంధించినవి కావడంతో విషయం రాజకీయ రంగు పులుముకుంటోంది. కక్షసాధింపు మేరకే భవనాల కూల్చివేత కొనసాగుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు ప్రజా వేదిక కూల్చిన వైసిపి సర్కారు... విశాఖలో తెలుగుదేశం నేతలకు సంబంధించిన భవనం టార్గెట్ చేసుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శలకు వైసిపి నేతలు ఏం సమాధానం చెబుతారో ?