ఇప్పటికే ప్రజా వేదిక కోసం జగన్ సర్కారు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా నోటీసు అందజేసింది. చంద్రబాబు నివాసం ఇంటి గోడకు సీఆర్డీఏ అధికారుల నోటీసులు అంటించారు.
సి ఆర్ డి ఎ జోనల్ అసిస్టెంట్ డైరెక్టరు పేరిట నోటీసు అతికించారు. తమ సాంకేతిక సిబ్బంది పరిశీలనతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించినట్లు నోటీసులో తెలిపారు. చంద్రబాబు నివాసం ఉంటోన్న భవన యజమాని లింగమనేని రమేష్ పేరిట నోటీసు జారీ చేశారు.
చంద్రబాబు నివాసం ఉంటోన్న జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారని... వాటికి అనుమతులు తీసుకోలేదని సి ఆర్ డి ఎ తమ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సి ఆర్ డి ఎ నోటీసులో పేర్కొంది.
సి ఆర్ డి ఎ నుంచి ముందుగా అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్–2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్డీఏ అభిప్రాయపడింది. అనుమతి లేని పైఅంతస్తు, గదులు, హెలిప్యాడ్ నిర్మాణాలను షోకాజ్ నోటీసులో పొందుపరిచారు.
తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.