అడవిలో మహిళా అధికారి ఆర్తనాదం...!!
ఆదివారం ఉదయం , కుమురుం భీం ఆసిఫాబాద్ జిల్లా , కాగజ్నగర్ మండలం సార్సాలా గ్రామంలో మహిళా ఫారెస్ట్ అధికారిణి పై కర్రలతోదాడి జరిగింది. తీవ్రంగా గాయ పడిన ఆమె భరించలేని నొప్పితో ఆర్తనాదాలు చేయగా... కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు.
అసలేం జరిగింది..?
అటవీశాఖ అధికారులు కాగజ్నగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం ఎఫ్ఆర్వో చోలే అనిత ఆధ్వర్యంలో అటవీసిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ పని జరుగుతున్న ప్రాంతానికి వచ్చి అటవీకరణ పనులను అడ్డుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అటవీభూములను స్వాధీనం చేసుకుంటామని ఎఫ్ఆర్వో అనిత వారికి స్పష్టం చేయడంతో , అధికారులు, కృష్ణ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన కృష్ణ, ఆయన అనుచరులు రేంజ్ ఆఫీసర్ అనితతో పాటు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
అటవీశాఖ సిబ్బందిపై కర్రలతో దాడికి దిగడంతో ఎఫ్ఆర్వో చోలే అనితకు తీవ్ర గాయాలయ్యాయి.ఆమెతో పాటు, పలువురు అటవీ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. రైతుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎఫ్ఆర్వో అనితను కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భరించ లేని బాధతో, కన్నీళ్ళు పెట్టు కుంటూ ... '' ఎమ్మెల్యే కోనప్ప తమ్ముడు క్రిష్ణ తన పై దాడి చేసినట్టు ...'' ఆసుపత్రిలో అనిత విలేకరులతో చెప్పారు... ఈ ఘటనపై అటవీ అధికారులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటన పై మరింత సమాచారం అందాల్సి ఉంది.