నిభంధనలు అతిక్రమించి అక్రమంగా కట్టిన భవనాలను ఉద్దేశించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా లింగమనేని గెస్ట్ హౌస్ గురించి మాట్లాడుతూ నోటీసు ఇస్తే ఆ భవన యజమాని, అసలు వ్యక్తి లింగమనేని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్ హౌస్ కి నోటీసులు పంపితే ఎల్లో మీడియా చానల్స్ కి, చంద్రబాబుకి ఎందుకు అంత భయం, అని? ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా అక్రమ నిర్మాణాలను కూల్చాలన్న నిర్ణయాన్ని 'కక్ష సాధింపు' చర్యగా ముద్ర వేసింది. జగన్కు దూకుడు ఎక్కువైందని, అంత పనికిరాదని, దీనివల్ల ఆయనకే నష్టమని టీడీపీ అనుకూల పత్రిక అభిప్రాయ పడింది. ఇందుకు తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు (జయలలిత, కరుణానిధి పరిపాలన) వ్యవహరించిన తీరును, తద్వారా కలిగిన నష్టాన్ని ఉదహరించింది.
కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనివేనని, ఆయన కారణంగానే అవి పుట్టుకొచ్చాయని తేల్చి పారేసింది. మొత్తం మీద వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహనరెడ్డి ఇద్దరిదీ కక్ష సాధింపు మనస్తత్వమని ముక్తాయించింది. ప్రజావేదికను చంద్రబాబు తనకు ఇవ్వాలని అడిగినందు కే జగన్ ఆగ్రహించి కూలగొట్టించారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
గతంలో నిబంధనలకు విరుద్ధంగా లింగమనేని రమేష్ నిర్మించిన గెస్ట్ హౌస్ లోనే సాక్షాత్తు ఆ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నారని ఆయన ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే దాన్ని లీజుకు తీసుకుని నివాసంగా మార్చుకున్నారని పేర్కొన్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి అక్రమ నిర్మాణమని తెలిసిన భవనంలో నివాసం ఉండవచ్చా? అసలదేం నైతికత? ఇప్పుడు లింగమనేని ఎట్టేట్ కూడా కూలగొట్టేందుకు వారు వ్యతిరేకిస్తున్నారు. అది చంద్రబాబు సొంతం కాకపోయినా నేతలు అలాగే ఫీలవుతున్నారు.
అంతే కాదు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ, రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు.
అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూములు యజమానులైన రైతులతో కలిసి ఆర్కే ఆ భూములను పరిశీలించారు.