తానొకటి తలిస్తే.. తమ్ముళ్లు మరొకటి తలచినట్టుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి. రాయలసీమలో పార్టీని పుంజుకునేలా చేయాలని ఆయన ఎంతో భావించారు. ముఖ్యంగా పార్టీకి కంచుకోట వంటి అనంతపురంలో పార్టీని బలోపే తం చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. కోరినవారికి కోరినట్టుగా సీట్లు ఇచ్చారు. ప్రాధాన్యం పెంచారు. నామినేటె డ్ పదవులు కూడా కట్టబెట్టారు. అయితే, ఎన్నికల్లో ఓటమి కారణంగా.. ఇప్పుడు అనంతపురం నేతలు బాబుకు చక్కలు చూపించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే గోనెగుంట్ల సూర్యనారాయణ ఉరఫ్ వరదాపురం సూరి పార్టీ నుంచి జంప్ చేసిబీజేపీలోకి చేరిపోయారు.
ఇక, మిగిలిన నాయకుల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ రాజకీయ సన్యాసం ప్రకటించారు. వారి ఇద్దరు కొడుకులపై గంపెడాశతో తాజా ఎన్నికల్లో నిలబెట్టి కోట్లు ఖర్చు చేసినా.. ఫలితం కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరుకుమారులు కూడా కుదిరితే వైసీపీ లేదంటే.. బీజేపీ అనే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జేసీ దివాకర్ రెడ్డి మీడియా ముందు నర్మగర్భంగా ఒప్పుకున్నారు కూడా. నిజానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీ వారసులు ఇద్దరూ కూడా ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి వచ్చింది లేదు. చంద్రబాబును కలిసింది కూడా లేదు. పైగా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరు వైసీపీ లేదా బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక, అత్యంత కీలకమైన పరిటా ల కుటుంబం కూడా త్వరలోనే పార్టీ మారుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత 2014 ఎన్నికల్లో పరిటాల రవి సతీమణి సునీత.. టీడీపీ నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే, తాజా ఎన్నికల్లో ఆమె తన వారసుడు పరిటాల శ్రీరాంకు అవకాశం కల్పించారు. ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారని పెద్ద ఎత్తున పందేలు కూడా కాశారు. అయితే, జగన్ సునామీ ముందు పరిటాల శ్రీరాం ఘోరంగా ఓటమి పాలయ్యారు.
అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోంది. ఇప్పటికి చంద్రబాబు రెండు సార్లు అనంతపురం రాజకీయాలపై సమీక్ష నిర్వహిస్తే.. ఏ ఒక్కరూ రాలేదు. దీంతో పరిటాల ఫ్యామిలీ కూడా బీజేపీ వైపు చూస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా టీడీపీకి కంచుకోట అనంతలో కీలక నేతలు చేజారడం ఖాయంగా కనిపిస్తోంది.