వైసీపీ కార్యకర్తలు, నేతలు దాడుల నుంచి టీడీపీ కార్యకర్తలకు రక్షణగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. గుంటూరు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేస్తే.. 7306299999 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సమాచారం అందజేయాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఆయన ప్రకటనలో ఏం చెప్పారంటే..
వైకాపా దాడులు, బెదిరింపులను తెలియజేయండి.. సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారంటూ కేసుల పేరుతో వేధించినా వెంటనే సమాచారం ఇవ్వండి..సంయమనం పాటిద్దాం.. న్యాయపరంగా ఎదుర్కొందాం..
పార్టీపరంగా కార్యకర్తలకు, నాయకులకు అన్నివిధాలా సహాయం అందిస్తాం.. 40 రోజుల్లో వంద చోట్ల పైగా దాడులు, దౌర్జన్యాలు చేయడం గర్హనీయం.. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపేయడం కిరాతకం.
బాధిత కుటుంబాలను ఆదుకునేందుకే ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. వైసీపీ వారెంత కవ్వింపు చర్యలకు దిగినా టిడిపి కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారు.. ప్రతి జిల్లాలో టిడిపి లీగల్ సెల్ ను సమాయత్తం చేస్తున్నాం.. కార్యకర్తలకు అన్నివేళలా, అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు నారా లోకేశ్.