విభజన కష్టాలతో అల్లాడుతున్న ఏపీకి కేంద్రం మరోసారి అన్యాయం చేసిందా? ఇప్పటికే దాదాపు రూ 26 లక్షల కోట్ల అప్పుల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీని పట్టించుకోవడంలో నిర్లక్షంగా వ్యవహరించిందా? రాజధాని నుంచి పోలవరం వరకు, కరువు మండలాల నుంచి అంగన్వాడీల వరకు ఏ విషయాన్నిపట్టించుకోలేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా కేంద్రం 2019-20 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. అయితే, దీనిపై ఏపీ ప్రభత్వం సహా ప్రజలు కూడా ఎన్నోఆశలు పెట్టుకున్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ఏర్పాటు చేసే సంస్థలకు నిధుల వరద పారుతుందని, గతంలో అయితే, చంద్రబాబు ప్రభుత్వంపై కోపంతో కేంద్రం బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చేయలేదని ఇప్పుడు బీజేపీకి అనుకూల ప్రభుత్వమే ఏపీలో ఉన్నందున కేటాయింపులు జోరందుకుంటామని అందరూ అనుకున్నారు. కానీ, తాజా బడ్జెట్ విషయంలో ఏపీ గురించిన ప్రస్థావనే కనిపించలేదు. ఏదో నామమాత్రంగానే రెండు విద్యా సంస్థలకు కేటాయింపులు చేశారు. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీకి రూ. 13 కోట్లు, గిరిజన వర్సీలీకి రూ. 8 కోట్లు కేటాయించారు. దీంతో రాజధాని అమరావతి సహాపోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
నిజానికి చంద్రబాబు అదికారంలో ఉన్న సమయంలో బీజేపీతో ఘర్షణకు దిగినా.. కూడా ఆయన కొంత మేరకు ఏపీకి నిధులు రాబట్టారు. అయితే, ప్రస్తుత జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్రాన్ని ఒప్పించి సాధించిన నిధులు అంటూ ఏపీ లేకుండా పోయాయి. అనేక రూపాల్లో ఇబ్బందులు పడుతున్న ఏపీకి ఇప్పుడు మరింత సమస్యలు ఎదురు కావడం ఖాయమని చెబుతున్నారు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలో విస్తరించాలని, వచ్చే 2024 ఎన్నికల్లో కుదిరితే తెలంగాణ, ఏపీల్లోనూ ఆధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఏదో ఒక విధంగా ఆదుకుంటుందని రాష్ట్రంలోని కమలం పార్టీ నాయకులు కూడా భావించారు.
అయితే, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ప్యాకేజీతో సరిపెడతామని చెప్పిన కేంద్రం.. ఆ ప్యాకేజీ నిధులకూ గండి కొట్టింది. ఇటీవల ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రామాణికంగా తీసుకున్నా.. దానిలోనూ ఏపీకి ఒనగూర్చింది ఏమీ లేక పోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు సపరించిన బడ్జెట్ను ఇటీవల ఆమెదించిన కేంద్రం.. నిర్వాసితులకు పరిహారం ప్రకటించే బాధ్యతను రాష్ట్రం మీదకే నెట్టేసింది. రాజధాని అమరావతికి ఏటా 350 కోట్లు ఇస్తున్నామని చెప్పిన కేంద్రం ఈ ఏడాది పొడిగించే విషయంపై ఓటాన్ బడ్జెట్లోనూ ప్రస్థావించలేదు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ మరింతగా ఏపీ ప్రజలు ఆశలపై నీళ్లు జల్లిందనే అంటున్నారు ఆర్థిక నిపుణులు.