కర్ణాటకలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది. గత కొంతకాలంగా కర్ణాటకలో రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. సడెన్ గా సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.
రాజీనామాలను స్పీకర్ కు అందజేశారు. స్పీకర్ ఇప్పటి వరకు వాటిని ఆమోదించలేదు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకొని రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రెండోసారి కూడా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో బలపరీక్షకు కుమారస్వామి సిద్ధం అవుతున్నాడు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్ కు తరలించింది. అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఓ హోటల్ లో ఉన్నారు.
సమావేశాలు జరిగే ముందు జరిగే పార్టీ సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేసినా సదరు అసమ్మతి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఇదిలా ఉంటె అటు గోవాలో ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో జాయిన్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ బలం గోవాలో 5 కు పడిపోయింది.
ఇప్పుడు ఇదే సీన్ రాజస్థాన్ లో రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతితో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ చెప్పడంతో అలజడి మొదలైంది. ఒక్క రాజస్థాన్ మాత్రమే కాదు..కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతున్నట్టు సమాచారం.