వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సానుకూల స్పందన లభిస్తోంది. ప్రత్యేకించి వైసీపీ నేతలైతే.. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల జీవితాలను సమూలంగా మార్చేస్తుందని చెప్పుకొస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ మాత్రం చెప్పకుండా ఎలా ఉంటారు.


కానీ.. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఇంకో అడుగు ముందుకు వేసేశాడు. ప్రజలు ఆకలేస్తుంది అన్నం పెట్టమని కోరితే..వైయస్‌ జగన్‌ బిర్యాని పెట్టారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మెచ్చుకున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మహేష్‌రెడ్డి బడ్జెట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.


మాట ఇచ్చిన తరువాత ఎంత కష్టమైనా మాట నిలబెట్టుకోవాలన్న వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఈ బడ్జెట్ ద్వారా మరోసారి రుజువైందని మహేశ్ రెడ్డి చెప్పారు. నవరత్నాల ద్వారా ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ ప్రజల ముందుకు వచ్చారని, తనకు అవకాశం ఇస్తే రాష్ట్ర రూపురేఖలు మార్చుతానని మాటిచ్చారన్నారు. ఈ రోజు అదే కోణంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.


రైతు భరోసా, ఆసరా, పింఛన్‌ కానుక, గృహ నిర్మాణాలు వంటి ఎన్నో పథకాలు ప్రకటించారన్నారు. గురుజాలలో మెడికల్‌ కాలేజీ స్థాపించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని, తన ఆనందానికి అవధుల్లేవని మహేశ్ రెడ్డి సంబరంగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: