జగన్ సీఎం కావాలని ఆ జిల్లా వాసులు చాలా ఎదురు చూశారు. ఇప్పుడు కాదు.. 2014లో జగన్ సీఎం అవుతాడని ఆ జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు అప్పట్లోనెరవేరలేదు. ఇప్పుడు 2019లో జగన్ సీఎం అయ్యాక తమకు అదృష్టం కలసివస్తుందని అనుకుంటున్నారు.
.
అదే ప్రకాశం జిల్లా.. ఎందుకంటే.. 2014లో జగన్ సీఎం అయ్యుంటే రాజధాని దొనకొండ ప్రాంతంలో పెట్టేవాడని పుకార్లు షికారు చేశాయి. దొనకొండ చుట్టుపక్కల ప్రాంతంలో వైసీపీ నేతలు చాలా మంది భారీగా భూమలు కొన్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపించారు.
ఏదేమైనా మొత్తానికి రాజధానిగా అమరావతి ఫిక్సయింది. దాన్ని మార్చే అవకాశం దాదాపుగా లేదు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు దొనకొండ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపడుతోంది. దొనకొండలో కొత్త ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకురాబోతున్నారని దాన్ని త్వరలోనే సీఎం ప్రకటిస్తారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంటున్నారు.
గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయారని మంత్రి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రాష్ట్రానికి ఫ్రైడ్ అనే ప్రాజెక్టు ఇవ్వాల్సి ఉందన్నారు. దాన్ని పబ్లిక్ సెక్టార్ ద్వారా చేయాలనుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దొనకొండలో కేవలం 5 వేల ఎకరాలు ఇవ్వమని అడిగిందన్నారు. ఈ స్థలంలో గొప్ప పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పినట్లు తెలిపారు. సో.. దొనకొండలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు వైసీపీ రెడీ అవుతుందన్నమాట.