ఏ మంత్రి అయినా అవినీతి చేస్తేనో.... అక్రమాలు చేస్తేనో... సీఎం వార్నింగ్ ఇస్తే నో టెన్షన్ ఉంటుంది. కానీ ఆ మంత్రికి మాత్రం చినుకు లేక వణుకు పుడుతోందట. చినుకు పడకపోతే అందరికీ టెన్షన్ ఉంటుంది. రైతులు, వ్యాపారులు, ప్రభుత్వం ఇలా ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. చినుకు పడితే రైతులు నాట్లు వేసుకుంటారు. చినుకు ఉంటేనే వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆ చినుకు ఉంటేనే కరెంటు తయారవుతుంది. అయితే ఇప్పుడు ఆ చినుకే లేకపోవడంతో తెలంగాణలో ఓ మంత్రిగారికి పెద్ద టెన్షన్ పట్టుకుందట. తెలంగాణలో నైరుతీ ఋతుపవన కాలం జూన్ రెండో వారం నుంచి ప్రారంభం అవుతుంది.
జూలై నుంచే రైతులు నాట్లు వేసేందుకు రెడీ అవుతుంటారు. ఈ ఏడాది జూన్, జూలైలో పెద్దగా వర్షాలు పడలేదు. అప్పుడే జూలై ఎండింగ్ వచ్చేసింది. దీంతో చాలా జిల్లాల్లో రైతులు విత్తనాలు నాటలేదు.మరోవైపు మొలక దశలో ఉన్న పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. గోదావరి - కృష్ణా జలాలు ఎగువ రాష్ట్రాల నుంచి రాకపోవడంతో తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండలేదు. ఈ ప్రాజెక్టులు ఎప్పటికీ నిండుకుండలా మారతాయో తెలియని పరిస్థితి. ఇవన్నీ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి టెన్షన్ గా మారిపోయాయి.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్లో అడుగుపెట్టిన నిరంజన్ రెడ్డి ఇప్పుడు తన సన్నిహితుల వద్ద కూడా వర్షాల గురించే ప్రస్తావిస్తున్నారట. సీఎం కేసీఆర్ తనకు వ్యవసాయ శాఖ కేటాయించడంతో ఎంతో ఆనంద పడిన ఆయన ఆనందం ఐదారు నెలల్లోనే ఆవిరి అయ్యే పరిస్థితి ఏర్పడిందటున్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు పెట్టుబడి సకాలంలోనే ఇచ్చినా... అసలు వర్షాలు లేకపోవడంతో ప్రభుత్వానికి పేరు లేకుండా పోతోందన్న ఆవేదన అటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు, మంత్రి నిరంజన్ రెడ్డికి ఉందట.
వర్షాలు లేకపోవడంతో తమను ఆదుకోవాలని రైతుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఎక్కువుగా ఉండడంతో నిరంజన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక ఆందోళనలో ఉన్నట్టు కూడా తెలంగాణ వ్యవసాయాశాఖ ఉన్నతాధికారుల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి చినుకు మంత్రిగారిని వణికిస్తోంది. మరి ఇప్పుడిప్పుడే చిరు జల్లులు స్టార్ట్ అయ్యాయి. రాబోయే రోజుల్లో అయినా వ్యవసాయానికి అనుకూలంగా వర్షాలు పడతాయా ? మంత్రి టెన్షన్ తగ్గుతుందా ? అన్నది చూడాలి.