ఆర్టికల్ 370 రద్దు చేయడంపై వివిధ పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న బీఎస్పీ, ఆప్ పార్టీలు కూడా రద్దు బిల్లును స్వాగతించాయి. ఎన్నో సంవత్సరాలుగా సమస్యాత్మకంగా ఉన్న కాశ్మీర్ సమస్యకు ఇది పరిష్కారం చూపిస్తోందని ఆయా పార్టీలు చెప్తున్నాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశం పార్టీ కూడా ఆర్టికల్ 370 రద్దును స్వాగతించింది. ప్రభుత్వం ముందు అసలైన సవాళ్లు ఉన్నాయని, వ్యాలీలో శాంతిభద్రతలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అలాగే జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా స్వాగతించారు. అక్కడి ప్రజలను ఎలా కన్విన్స్ చేస్తారు అనే దానిపై ప్రభుత్వంపనితీరు ఆధారపడి ఉంటుంది. దాదాపుగా చాలా పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని హర్షించాయి. అయితే, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మాత్రం దీనిని వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, ఈ రద్దు విషయంలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్తున్నా.. కెసిఆర్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. కారణం ఏంటి అన్నది తెలియాలి.
రాష్ట్రంలో తెరాస కు, బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో పాటు గత ఎన్నికల్లో తెలంగాణాలో నాలుగు సీట్లు గెలుచుకుంది. రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 74 రోజుల్లోనే కాశ్మీర్ పై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది మోడీ సర్కార్ కు పెద్ద విజయం అని చెప్పాలి. మోడీ సర్కార్ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడితే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి.. ఒకవేళ అనుకూలంగా మాట్లాడితే..
రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తో ఇబ్బందులు వస్తాయి. అందుకే కెసిఆర్ సైలెన్స్ గా ఉన్నారని తెలుస్తోంది. గత 70 సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యను బీజేపీ పరిష్కరించింది. బీజేపీ అనుకుంటే ఏదైనా చేస్తుంది అనే ముద్ర పడుతుంది. ఇది బీజీపీని వ్యతిరేకించే పార్టీలకు మింగుడుపడని విషయం. కెసిఆర్ సైలెన్స్ గా ఉంటారో లేదంటే దీనిపై స్పందిస్తారో చూడాలి.