బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్ పై అత్యాచారం కేసు నమోదైంది. మనోజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయనకు స్వయానా కోడలే పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మనోజ్పై కోడలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మనోజ్ కోడలు అయిన బాధితురాలు గతేడాది డిసెంబర్ 31 న తన భర్త, సోదరుడు, బంధువులతో కలసి పుట్టింటి నుంచి మీర్ బాగ్ లోని తన అత్తవారింటికి బయలుదేరింది.
అక్కడ మధ్యలోనే ఆమె భర్త కొత్త సంవత్సరం వేడుకల కోసం పశ్చిమ విహార్ లోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ జరిగిన తర్వాత రాత్రి 12:30 గంటల సమయంలో మీర్ బాగ్ లోని తమ ఇంటికి చేరుకున్నారు. ఆమెను ఇంటి వద్ద దించేసిన భర్త తన ఫ్రెండ్స్తో కలిసి మళ్లీ మరో పార్టీలో ఎంజాయ్ చేసేందుకు బయటకు వెళ్లిపోయాడు. ఇక ఇంటి దగ్గర బాధితురాలు పడుకుంది.
రాత్రి 1:30 సమయంలో ఆమె తన గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న వేళ అప్పటికే మద్యం సేవించిఉన్న మాజీ ఎమ్మెల్యే అయిన ఆమె భర్త తండ్రి మనోజ్ ఆమె గదిలోకి వచ్చాడు. నిద్రలో ఉన్న ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె గట్టిగానే ప్రతిఘటించింది. అయితే మనోజ్ తన వద్ద ఉన్న గన్తో ఆమెను బెదిరించి తనపై అత్యాచారం చేశాడని ఆమె వాపోయింది.
ఈ విషయం బయటపెడితే తన తమ్ముడిని, కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం బయటపెడితే తన కాపురం కూలిపోతుందని... తన భర్త తనను అనుమానించి బయటకు పంపేస్తాడన్న భయంతోనే ఇప్పటి వరకు నోరు మెదపలేదని వాపోయింది.
గత కొంతకాలంగా మళ్లీ మనోజ్ ప్రవర్తనలో మార్పు రావడం... ఇటు తన భర్త కూడా అనుచితంగా ప్రవర్తిస్తుండడంతో అత్తవారింటిపై గృహహింస కేసు పెట్టినట్టు తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్పై సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై పూర్తిగా ఎంక్వయిరీ చేసి యాక్షన్ తీసుకుంటామని డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ పి.కురువిల్లా తెలిపారు. ఇక ఈ విషయం ఇప్పుడు ఢిల్లీ బీజేపీలో పెద్ద సంచలనంగా మారింది.