తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వెన్నుపోటు అంశంపై రెండు దశాబ్దాలుగా ఎంతో మంది రాజకీయ మేథావులు విశ్లేషకులు, చరిత్రకారులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను చంద్రబాబు అన్యాయంగా పదవి నుంచి దింపేశారు. అది తెలుగు రాజకీయ చరిత్రలోనే ఓ వెన్నుపోటు ఘట్టంగా మిగిలిపోతుందని చాలామంది విమర్శిస్తుంటారు.
ఈ కీలకమైన రాజకీయ ఘట్టంలో పాలుపంచుకున్న ఆనాటి నాయకుల గురించి ఎవరికైనా సహజంగా ఆసక్తి ఉంటుంది. ఈ వెన్నుపోటు ఘట్టానికి ప్రధాన సూత్రదారి చంద్రబాబు కాగా... ఈ ఘట్టంలో చాలా మంది నాయకులు కీలక పాత్ర పోషించారు. ఈ వెన్నుపోటు ఘట్టంలో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర గురించి... కెసిఆర్ కింద నిన్నటి వరకు పనిచేసిన మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఆ ఎంపీ ఎవరో కాదు వివేక్.
ఇటీవలే బీజేపీలో చేరిన వివేక్ తన అనుచరులు, నేతలకు హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో కాషాయ కండువా కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెన్నుపోట్లు పొడవడంలో కేసీఆర్ దిట్ట అని... నాడు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచేచినప్పుడు కూడా కేసీఆర్దే కీ రోల్ అన్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు విషయంలోనూ అదే జరుగుతోందని అన్నారు.
ఉద్యమకారులు అంటే కేసీఆర్కు ముందు నుంచి పడదని... ఎన్నోసార్లు హరీష్రావును వాడుకున్న కేసీఆర్ ఆయన గొంతు కోశారని వివేక్ విమర్శించారు. ప్రజల కోసమే తెలంగాణ కోసం పోరాటాలు చేశానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కల్వకుంట్ల తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారని వివేక్ ఆరోపించారు. కేసీఆర్ ఇప్పుడు కేవలం సొంత కుటుంబం కోసమే తెలంగాణను పాలిస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని... ఇక తన రాజకీయాల విషయానికి వస్తే తాను బీజేపీలో చేరి మంచి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏదేమైనా ఎన్టీఆర్ వెన్నుపోటుకు కేసీఆర్ రోల్కు లింక్ పెట్టి వివేక్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపాయి.