టీడీపీకి చెందిన విజయవాడ అసంతృప్త ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు మార్క్ షాక్ తగిలింది. కొద్ది రోజులుగా నాని టీడీపీ అధిష్టానం తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వార్ కంటిన్యూ చేశారు. ముందుగా చంద్రబాబుతో తన అసంతృప్త యుద్ధాన్ని ప్రారంభించిన నాని చివరకు వెంకన్నను టార్గెట్గా చేసుకుని అనేక పోస్టులు పెట్టారు.
చివరకు ఈ వార్ నానిపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత పీవీపీ వర్సెస్ నాని పోరుగా మారిపోయింది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కేశినేని నాని కంటే ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న లాంటి వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం నానికి నచ్చడం లేదు. ఈ క్రమంలోనే నాని తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన తనకు కాదని... ఓడిన వాళ్లకు ఎందుకు ప్రయార్టీ ఇస్తున్నారన్నదే నాని ఆగ్రహానికి ప్రధాన కారణం.
ఇదిలా ఉంటే బాబు ఒకటి రెండుసార్లు నానిని సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. చివరకు సోమవారం నానికి బాబు మార్క్ షాక్ తగిలింది. ఇప్పటి వరకు కేశినేని నానికి చెందిన కేశినేని భవన్లో ఉన్న అర్బన్ టీడీపీ కార్యాలయాన్ని అక్కడ నుంచి తరలించేశారు. దీనిపై నాని ‘లెస్ లగేజ్మోర్ కంఫర్ట్’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అర్బన్ కార్యాలయాన్ని అక్కడ నుంచి తీసివేసి... ఆటోనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలోనే పని చేస్తుందని టీడీపీ ప్రకటన చేసింది.
సోమవారం అర్బన్ టీడీపీ కార్యాలయం తరలింపుపై ప్రకటన కూడా వెలువడింది. ఇక పట్టణ టీడీపీ కార్యాలయం తరలింపు వెనక బుద్దా వెంకన్న హస్తం ఉన్నట్లు కేశినేని నాని అనుమానిస్తున్నారు. వెంకన్నే చంద్రబాబు, లోకేష్కు చెప్పి అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి తప్పించేశారన్నదే నాని వర్గీయుల ఆరోపణ. ఇకపై విజయవాడ టీడీపీ అర్బన్ కార్యక్రమాలు అన్ని జిల్లా టీడీపీ కార్యాలయం నుంచే జరుగుతాయంటూ కూడా తాజా ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే వెంకన్నను ఉద్దేశించి నాని లగేజ్ తగ్గితే మరింత సౌకర్యంగా ఉంటుందంటూ ట్విటర్లో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.