జబర్దస్త్ కార్యక్రమానికి సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులతో ప్రస్తుతానికి చేసుకున్న కాంటాక్ట్ ముగియగానే జబర్దస్త్ షో న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి ఆమె సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతోంది . ఇక పై పూర్తిస్థాయి లో రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తోన్న రోజా, జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహిత వర్గాల చెబుతున్నాయి. రోజా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక కారణమని తెలుస్తోంది.
ఇటీవల తమిళనాడులోని అత్తి వరదరాజ స్వామిని దర్శించుకునేందుకు కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడు కు వెళ్లిన విషయం తెల్సిందే . ఈ సందర్బంగా కెసిఆర్ కు రోజా, నగరిలో ఘన స్వాగతం పలికారు . ఆయనతోపాటు అత్తి వరదరాజ స్వామి దేవాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని తిరుగు ప్రయాణం లో తన ఇంట్లో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు విందు ఏర్పాటు చేశారు. రోజా ఇంట్లో విందు ఆరగించిన కెసిఆర్ ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు గుడ్ బై చెప్పి సీరియస్ గా రాజకీయాలపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా రోజా కు ఎంతో భవిష్యత్తు ఉన్నదన్న కేసీఆర్ , ఈ పర్యటన సందర్బంగా రోజా తన కూతురు వంటిదని పేర్కొన్న విషయం తెల్సిందే .
రెండవసారి నగరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోజా కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి గ్యారెంటీ అన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా రోజా మంత్రి పదవి దక్కకపోయినా, ఆమె కు కేబినెట్ హోదా కలిగిన ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. మరో రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి వర్గ విస్తరణ లో రోజా కు ఖచ్చితంగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం నేపధ్యం లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే , భవిష్యత్తు రోజా మంత్రి పదవి ఖాయమని స్పష్టం అవుతోంది .