తమిళనాడు తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లోనూ ప్రభుత్వమే మద్యం షాప్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది . ప్రైవేట్ వ్యక్తుల కంటే , రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధివకాశాలను కల్పించవచ్చునని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు . యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా … రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని నేడు విడుదల చేసింది .ఇకపై ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .
ఈ ఏడాదికి 3 వేల 500 మద్యం దుకాణాలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది . మద్యం దుకాణాల నిర్వహణకు మండలాలు,మున్సిపాల్టీలు,కార్పొరేషన్ల లో షాపుల ప్రదేశాల ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నేతృత్వం లో గుర్తించనున్నారు . ఒక్కో మద్యం షాపు నిర్వహణకు 150 నుంచి 300 చ.అడుగుల విస్తీర్ణంలో షాప్ ను కేటాయించనున్నారు . ప్రతి షాపుకు తెలుగు,ఇంగ్లీషుల్లో బేవరేజెస్ కార్పొరేషన్ నెంబర్ బోర్డులు వేయించనుంది. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ లో ప్రతి మద్యం దుకాణం నిర్వహించనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఒక్కో షాపుకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు,గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమించనుంది .
డిగ్రీ అర్హత కలిగిన వ్యక్తులను సూపర్ వైజర్ గా నియమించి వారికి 17 వేల 500 వేతనం అందజేయనున్నారు . ఇక ఇంటర్ విద్యా అర్హత కలిగిన వారిని సేల్స్ మెన్లుగా నియమించి 15 వేల జీతం అందజేయనున్నారు . సూపర్ వైజర్లను , సేల్స్ మెన్లను పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు . ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మద్యం విక్రయించనున్నారు .