తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తినడానికి కారణం ఎవరు?... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవలంభించిన విధానమే కారణమా?... తెలంగాణ తెలుగుదేశం పై పార్టీ నాయకత్వం ఒకింత దృష్టిసారించి వుంటే … ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉండేది కాదా? అంటే అవుననే ఆ పార్టీ వర్గాల నుంచి సమాధానం విన్పిస్తోంది . గతం లో టీడీపీ ని వీడిన నేతలంతా ఆ పార్టీ నాయకత్వం పై విమర్శలు చేయడం తెల్సిందే . కానీ పార్టీని వీడుతున్న సమయం లో భావోగ్వేదానికి గురయి కంట తడిపెట్టుకున్న నాయకులను చూస్తే ఆశ్చర్యమాన్పించక మానదు .
పార్టీతో ఏళ్లతరబడి ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక, తెంచుకుని మరి వెళ్తున్న నాయకులను చూస్తుంటే, తెలంగాణ తెలుగుదేశం పట్ల పార్టీ నాయకత్వం వైఖరి ఏమిటో ఇట్టే అర్ధమవుతోంది . గతంలో కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి నాయకత్వ పై తీవ్ర విమర్శలు చేయడం చూసిన వారికి... తాజాగా పార్టీని వీడుతూ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు భావోగ్వేదానికి గురయి కంట తడి పెట్టుకున్న తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీలో చేరుతున్నానని ఆనందం కంటే ఆయనలో టిడిపిని వీడుతున్నాననే బాధ ఎక్కువ కనిపించింది. టిడిపిని వీడి బీజేపీ కండువా కప్పుకునే సమయంలో ఆయన కన్నీటి పర్యంతం కావడం, అయన వెంట బీజేపీ లో చేరిన పార్టీ కార్యకర్తలను, నాయకులను తీవ్రంగా కలిచివేసింది .
చంద్రబాబు వైఖరిని తప్పు పట్టకుండానే ఆయన కొంత మంది నాయకులను మాత్రం టార్గెట్ చేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీని చావు దెబ్బ తీసేందుకు కారణమయ్యారని ఆరోపించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఇద్దరే కనిపిస్తున్నారని, నిజానికి తెలుగుదేశం పార్టీ పై పార్టీ నాయకత్వం దృష్టి సారించి ఉంటే ఈ దుస్థితి నెలకొని ఉండేది కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .