యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. రిలీజ్కు 15 రోజుల ముందే సాహో ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు సాహో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఈ సినిమాను చూడొద్దంటూ టీడీపీ కేడర్కు ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందంటూ ఓ వెబ్సైట్ రాసిన కథనంపై ఆ పార్టీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా పొలిటికల్ కాక రేపుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ తమిళ్ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఏపీలో యంగ్ సీఎంగా జగన్ బాగా పని చేస్తున్నాడని కితాబు ఇచ్చాడు. జగన్ను తమిళనాట అందరూ పొలిటికల్ బాహుబలి అని పిలుస్తున్నారని ప్రశ్నించగా... జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
దీంతో టీడీపీ అధిష్టానం ఈ సినిమా చూడొద్దని కేడర్కు ఆదేశాలు ఇచ్చిందన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. దీనిపై మండిపడిన నారా లోకేష్ తాము సాహోను వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు. అంతేకాదు సాహోను విజయవంతం చేయాలంటూ ట్విటర్ వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇలాంటి అబద్దపు వార్తలు రాసి ఆ డబ్బుతో కనీసం అన్నం తినగలరా అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.
సాహో సినిమా కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానని... సినిమా బ్లాక్బస్టర్ కావాలని ఆకాంక్షించాడు. ఇటు జగన్ పాలనను ప్రభాస్ మెచ్చుకోవడం... అటు టీడీపీ అధినేత చంద్రబాబు పాలనపై ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు విమర్శలు గుప్పించడాన్ని కూడా ఆ వెబ్సైట్ తన కథనంలో రాసింది. దీంతో టీడీపీ వాళ్లు సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయాలనుకుంటున్నారని కూడా ఆ కథనంలో ఉంది. దీనిపై లోకేష్ పైవిధంగా స్పందించాడు.