బీజేపీ నేత,కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ (66) కన్నుమూశారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న శనివారం మధ్యాహ్నం చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 12.07 నిముషాలకు అరుణ్ జైట్లీ మరణించారని ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన మరణ వార్తతో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీకి బయల్దేరారు.
ఆగస్టు 9 నుంచి ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. ఆగస్టు 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హైల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. 20వ తేదీ నుంచి వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు. జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. మధ్యలో కొన్ని రోజులు ఆయన చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లి వచ్చారు.
అరుణ్ జైట్లీ 1952లో డిసెంబర్ 28న మహరాజ్ కిషన్ జైట్లీ, రత్నప్రభ దంపతులకు ఢిల్లీలో జన్మించారు. తండ్రి న్యాయవాది కావడంతో జైట్లీ కూడా కామర్స్లో హానర్స్ డిగ్రీ చేశారు. అనంతరం 1977లో ఢిల్లీలోని లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారత విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. మోడీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు.
ఆయన ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే కీలకమైన నోట్ల రద్దు, GST వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో 2019 సార్వత్రిక ఎన్నికలకు జైట్లీ దూరంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చింది. ఎమర్జెన్సీతోనూ ఆయనకు సంబంధం ఉంది. ఆ టైంలో ఆయన ఏకంగా 19 నెల ల పాటు జైళ్లో కూడా ఉన్నారు.
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన టైమ్లో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన్ను ఆర్థికమంత్రిని చేయడంతో పాటు రాజ్యసభకు పంపారు.