వేలకోట్ల రూపాయల సంపాదన ఉండి.. కేంద్ర నుంచి నిధులు తెచ్చుకొని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటాయి. గత కొంతకాలంగా రాష్ట్రాల్లో తక్కువ ధరకే భోజన పధకాలు అమలు చేస్తున్నారు. రెండు రూపాయలకు టిఫిన్, ఐదు రూపాయలకు భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పధకాలు కాబట్టి నష్టం వచ్చినా ఎలాగోలా భరిస్తుంది. అయితే, ఒక చిన్న హోటల్ లో టిఫిన్ చేయాలన్నా కనీసం 20 నుంచి 30 రూపాయలు అవుతుంది.
గట్టిగా టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఖతం. ఎంత పల్లెటూరు కావొచ్చు.. ఇడ్లీ ధర ఇప్పుడు అక్కడ చూసుకున్నా 15 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. మహేష్ బాబు పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఆలీకి రూపాయి దానం చేసి పండుగ చేసుకో అంటే రూపాయితో ఏ వస్తువులు వస్తాయో ఠక్కున చెప్పమంటే ఏం చెప్పాలో అర్ధంగాక తెల్లమొహం వేస్తాడు బ్రహ్మానందం. కానీ, అదే రూపాయితో ఓ 80 సంవత్సరాల వృద్ధురాలు కడుపునింపుతుంది.
నిజంగా ఇది గ్రేట్ అని చెప్పాలి. 80 సంవత్సరాల కమలతల్ గత 30 ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నది. హోటల్ బిజినెస్ అంటే అదేదో పెద్ద బిజినెస్ కాదు. తాను ఉంటున్న ఇంట్లోనే చిన్న హోటల్ ను తెరిచింది. ముందు రోజు సాయంత్రమే కావాల్సిన వాటిని సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటిలా ఆమెకు గ్రైండింగ్ విధానం తెలియదు. రోట్లోనే పిండి రుబ్బుతుంది. చట్నీని రుబ్బుతుంది.. అన్ని సిద్ధం చేస్తుంది.
ఉదయం తెల్లవారే సరికి హోటల్ ఓపెన్ అవుతుంది. తెల్లతెల్లవారుతుండగా వేడివేడిగా ముసలి బామ్మ హోటల్లో ఇడ్లి రెడీగా ఉంటాయి. ఇడ్లి ధర కేవలం ఒక్క రూపాయి మాత్రమే. అంతకంటే ఎక్కువ ఇస్తే ఆమె తీసుకోదు. ఇలా రోజు ఆ బామ్మ 1000 ఇడ్లీలు అమ్ముతుంది. ఇడ్లీలతో పాటు రుచికరమైన చట్నీ, సాంబార్ అన్ని రెడీగా ఉంటాయి. ఈ బామ్మ కుటుంబం ఉమ్మడి కుటుంబం అంట. ఇంట్లో ఎప్పుడు పదిమంది ఉండేవారు. వాళ్లకు వండిపెట్టడమే అలవాటుగా మారిన బామ్మకు .. కుటుంబం అంతా వేరేవేరే చోటికి వెళ్ళిపోయినా... వండిపెట్టే అలవాటు ఉండటంతో.. 30 ఏళ్ళక్రితం ఇలా హోటల్ పెట్టుకుంది. 80 ఏళ్ళవయసులోను రోజుకు వెయ్యి రూపాయలకు పైగా సంపాదిస్తోంది.. ఏమి చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చొనే వాళ్లకు ఈ బామ్మ ఆదర్శంగా నిలుస్తోంది.