కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు యుద్దానికి దారితీస్తుందా..? కాశ్మీర్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాయాది పాకిస్తాన్కు కోపం తెప్పించినప్పటికి ఆ కోపం ఎటువైపు పయనిస్తుంది.. దాయది పాకిస్తాన్ కాశ్మీర్ ఆంశాన్ని అంతర్జాతీయం చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నప్పటికి ఆ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. నరేంద్రమోడీ మాత్రం తన పనిని చాపకింద నీరులా చేసుకుంటూ ప్రపంచదేశాలను తనవైపుకు తిప్పుకోవడంలో విజయం సాధిస్తున్నారు.
అయితే పాకిస్తాన్ ప్రపంచ దేశాల మద్దతు దొరకనప్పటికి చైనా మాత్రం అండగా నిలుస్తుండటం దాయాదికి కలిసొస్తున్న అంశం. అయితే ప్రపంచంలోనే ఏకాకిగా మారుతున్న పాకిస్తాన్ చివరి అస్త్రంగా అణుయుద్దానికి వెళుతుందా..? వెళితే ఇటు భారత్, అటు పాకిస్తాన్ లో అణు సామార్థ్యం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ ఫిబ్రవరిలో ఓ అంశాన్ని తెరమీదికి తేవడమే కాకుండా, భారత్తో అణుయుద్ధానికి వెళితే పాకిస్తాన్ అనే దేశం ఒకటుండేదని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుందని మిలిట్రీకి విడమర్చి చెప్పాడట.
భారత్ పై పాకిస్థాన్ ఒక్క అణుబాంబును ప్రయోగిస్తే భారత్ 20 అణు బాంబులు వేసి పాకిస్థాన్ ను తుడిచిపెట్టేస్తుందని ఆయన హెచ్చరించారు. అలా పాకిస్థాన్ తుడిచిపెట్టుకుపోకుండా ఉండేందుకు పరిష్కార మార్గాన్ని కూడా ఆయనే సూచించారు. అదేమిటంటే భారత్ ను నాశనం చేయాలంటే పాకిస్థాన్ ఏకకాలంలో 50 అణుబాంబులు భారతీయ నగరాలపై ప్రయోగించాలి. మరి అది సాధ్యమా ? అదీ చూద్దాం. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా వద్ద వేల సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం అమెరికా వద్ద 6,185 అణుబాంబులు ఉన్నాయి. రష్యా వద్ద 6, 490 ఉన్నాయి.
ఫ్రాన్స్ వద్ద 300, బ్రిటన్ వద్ద 200 అణుబాంబులు ఉన్నాయి. చైనా వద్ద 290 అణుబాంబులు ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద 160 దాకా అణుబాంబులు ఉంటే భారత్ వద్ద 140 దాకా ఉన్నట్లు ఒక అంచనా. ప్రపంచంలో 14 వేల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీటిలో 90శాతం అమెరికా, రష్యాల వద్దనే ఉన్నాయి. కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే వీటిలో 9500 మాత్రమే ఆయా దేశాల సైన్యాలకు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దేశాలు చెరో 1400 అణుబాంబులను సర్వసన్నద్ధంగా మోహరించి ఉన్నాయి. అవి గాకుండా చెరో 4 వేల అణుబాంబులను నిల్వ ఉంచుకున్నాయి. చెరో 6 వేల అణుబాంబులను నిర్వీర్యం చేయనున్నాయి.
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, తాజాగా పాక్ రైల్వే శాఖ మంత్రి అంతిమ యుద్ధం గురించి మాట్లాడారు. అంతిమ యుద్ధం అంటే అణు యుద్ధమే. భారత్కు సంప్రదాయక యుద్ధంతో పాక్ సరిరాదు. ఇక పాకిస్తాన్తో యుద్దమే వస్తే భారత్ వద్ద అణుశక్తి బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్, నేల, నింగి, సముద్రం నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే శక్తి భారత్ కు ఉంది. పాకిస్థాన్ కు మాత్రం ఇలాంటి సామర్థ్యం లేనప్పటికి, పాకిస్థాన్ శక్తిసామర్థ్యాలు తక్కువేం కాదు. పాకిస్తాన్ వద్ద షాహీన్ 3 లాంటి మిసైల్స్ ఉన్నాయి. దాంతో అది అండమాన్ దీవులపై కూడా అణుబాంబులు ప్రయోగించగలదు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండు దేశాలు కూడా పొరుగు దేశపు అంచుల దాకా అణు బాంబులను ప్రయోగించే సత్తా కలిగిఉన్నాయి. భారత్ తొలిసారిగా 1974 మే 18న అణు పరీక్ష నిర్వహించింది. స్మైలింగ్ బుద్ధ పేరిట పోఖ్రాన్ లో న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరిగింది. 1998 మే 11న రెండో అణు పరీక్ష జరిగింది. 1998 మే 28న పాకిస్థాన్ తొలిసారిగా ఐదు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది.. ఒకవేళ యుద్దమే వస్తే పాక్ అణ్వస్త్రాలను ప్రయోగించడం అటుంచి వాటిని కాపాడుకోవడం కూడా పెద్ద సమస్యనే. పాక్ తన అణ్వస్త్రాలను దాచిన ప్రాంతాలివే అంటూ అమెరికాకు చెందిన రక్షణ నిపుణులు ఓ జాబితా వెలువరించారు.
1. ఆక్రో గారిసన్ (సింధ్) 2. గుజ్రాన్ వాలా గారిసన్ (పంజాబ్) 3. ఖుజ్ దార్ గారిసన్ (బలూచిస్థాన్) 4. మస్ రూర్ డిపో (కరాచీ) 5. నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ (ఫతేజంగ్) 6. పానో అకిల్ గారిసన (సింధ్) 7. సర్గోదా డిపో (పంజాబ్) 8. తార్బాలా (ఖైబర్ ఫక్తూన్ ఖ్వా) 9. వాహ్ ఆర్డనన్స్ ఫెసిలిటీ (పంజాబ్) వీటిపై భారత్ గురిపెడితే పాకిస్తాన్ పరిస్థితి స్మశానమే... అందుకే పాకిస్తాన్తో భారత్కు యుద్ధం రాకుండా నివారించేందుకు అగ్రదేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.