ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా గులాబీ పార్టీలో చాలా మంది పైకి చెప్పుకోలేకపోయినా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా తనకు ఎవరైనా ఎదురొస్తారనుకుంటే వాళ్లకు ఎలా చుక్కలు చూపిస్తారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అపొజిషన్లో ఉన్న మహామహాలునే ఈ ఎన్నికల్లో తన మైండ్తో అసెంబ్లీ మెట్లక్కకుండా చేశారు. ఇక సొంత పార్టీ నేతలు ఎదురు తిరిగినా ? ఎక్కువ చేసినట్టు అనిపించినా ? ఊరుకుంటారా ? ఊరుకోరు కదా.. ఈ క్రమంలోనే కేసీఆర్పై కోపంతో ఉన్న నేతలంతా ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నదే టీ పాలిటిక్స్లో వినిపిస్తోన్న హాట్ టాపిక్.
ఇక కొద్ది రోజులుగా టీఆర్ఎస్లో ఉన్న అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాటల్లోనే తన అసంతృప్తి బయట పెట్టుకున్నారు. ఇక హరీష్ను క్రమక్రమంగా సైడ్ చేస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. హరీష్కు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కూడా అదే కారణం అంటున్నారు. విమర్శలు రాకుండా ఉండేందుకే కేసీఆర్ హరీష్తో పాటు తనయుడు కేటీఆర్కు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.
ఇక టీఆర్ఎస్ ఎప్పుడు రెండు ముక్కలవుతుందా ? అని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వాళ్లు కాచుకుని కూర్చొని ఉన్నారు. ఈ క్రమంలోనే ఈటల వ్యాఖ్యలతోనే టీఆర్ఎస్లో రెండు గ్రూపులు ఉన్నాయన్న విషయం తేలిపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని, తెలంగాణలో నియంత పాలన సాగుతోంది, కేసీఆర్ అవినీతిపై భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. భట్టి వ్యాఖ్యలు ఎలా ఉన్నా ? వీటిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లోనే కాకుండా... టీఆర్ఎస్లోనూ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఈటల గులాబీ జెండా ఓనర్లలో ఒకడినని అంటే ఆయనకు కౌంటర్గా మరో మంత్రి ఎర్రబెల్లి గులాబీ జెండా బాస్ కేటీఆర్ మాత్రమే అన్నారు. ఇక కేటీఆర్ కూడా పదవులు రాగానే కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ ఈటలను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక దసరాకు హరీష్రావుకు మంత్రి పదవి రాకపోతే ఆయన రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈటలను పక్కన పెడితే ఆయన కూడా కేసీఆర్కు షాక్ ఇస్తారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే భట్టి పార్టీ రెండు ముక్కలవుతుందన్న అర్థంలో చేసిన వ్యాఖ్యలు గులాబీ వర్గాలను టెన్షన్ పెట్టేస్తున్నాయి.