2018లో జరిగిన ఎన్నికల తరువాత తెరాస పార్టీ హరీష్ రావుకు పెద్దగా ప్రాతినిత్యం ఇవ్వలేదు. హరీష్ రావును నిన్నటి వరకు ఎమ్మెల్యేగానే ఉంచింది. పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఆయనకు ప్రతినిత్యం ఇవలేదు. దీంతో హరీష్ రావును కావాలనే పక్కన పెడుతున్నారని టాక్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నసమయంలోనే ప్రారంభం అయ్యింది. హరీష్ రావు ఆ ప్రాజెక్టును భుజాలపై వేసుకొని ముందుండి నడిపించాడు.
అయితే, ఎందుకో మరి హరీష్ రావుకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా హరీష్ రావును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ చూసింది. చూడటమే కాదు. హరీష్ రావును తమవైపు తిప్పుకుంటే.. తెలంగాణాలో చక్రం తిప్పొచ్చని అనుకున్నారు. ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. హరీష్ రావు మద్దతు దారులు కూడా బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. హరీష్ రావు బీజేపీలో జాయిన్ అయితే ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని, వచ్చే ఎన్నికల్లో హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకున్నారు.
ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కెసిఆర్ హరీష్ రావును పక్కన పెడితే బీజేపీ దూకుడు పెంచడం ఖాయం అనిభావించి కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో హరీష్ రావు పేరును కూడా చేర్చారు. హరీష్ రావుకు ఇష్టమైన ఇరిగేషన్ శాఖను కాకుండా ఆయనకు ఆర్థికశాఖను కేటాయించారు. ఈ శాఖ కేవలం రాష్ట్ర ఆర్ధికపరమైన విషయాలు మాత్రమే చూసుకుంటుంది.
ప్రజల్లోకి వెళ్లి వాళ్లతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ శాఖకు పెద్దగా సంబంధం ఉండదు. ప్రభుత్వ ఆర్ధిక అంశాలకే పరిమితం అవుతుంది. దీంతో ప్రజలతో అనుబంధం తగ్గిపోతుంది. సామాన్యులతో మాట్లాడే అవకాశం తగ్గిపోతుంది. ప్రజల్లో తిరిగే విషయాలు తగ్గిపోతాయి. ప్రభుత్వంలో కీలకశాఖ కాబట్టి బాధ్యత పెరుగుతుంది. ఇరిగేషన్ శాఖ ఉన్నట్టు నిత్యం అయన ప్రజల్లో ఉండేవారు. నీటి పారుదల విషయాలు చూసుకున్నారు. దగ్గరుండి చెరువులకు పూడికలు తీయించారు.
హరీష్ రావుకు ఆర్థికశాఖ కట్టబెట్టి పాపం ఆయన చేతులను కట్టేశారు. మంత్రి పదవి ఇచ్చామనే కంటితుడుపుగానే దీన్ని భావించాలి. మాస్ లీడర్ గా పేరున్న హరీష్ రావుకు మాస్ లో తిరిగే అవకాశం ఇస్తే.. అది పార్టీకి లాభం. పార్టీ పునాదుల నుంచి గట్టి చేస్తూ వస్తుంటారు. కానీ ఇప్పుడు పార్టీలో ఆర్ధిక శాఖను కట్టబెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటో కెసిఆర్ కు తెలియాలి. హరీష్ రావులాంటి మాస్ లీడర్ జనాల మధ్యన, జనాలతో సంబంధం ఉన్న శాఖను కేటాయిస్తే బాగుండేది.