వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మద్దతు పలకడం చూస్తుంటే... అసలు టిఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఈటెలకు తొలుత మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మద్దతుగా నిలువగా, ప్రస్తుతం నాయిని నరసింహారెడ్డి సైతం దన్నుగా నిలుస్తున్న ట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారు. ఇక అదే సమయంలో మంత్రివర్గంలో మాదిగల ప్రాతినిధ్యం లేదంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చేసిన వ్యాఖ్యలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి .
టిఆర్ఎస్ లో ఇన్నాళ్లూ నోరు విప్పడానికి సాహసించని ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇప్పుడు ఒకొక్కరుగా ధిక్కార స్వరాన్ని వినిపించడానికి ఇటీవల ఈటెల చేసిన వ్యాఖ్యలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రం లో బిజెపి పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్న తరుణంలో, టిఆర్ఎస్ లో అసమ్మతి సెగలు రాజు కోవడం చూస్తుంటే, అధికారపార్టీ లో అసమ్మతి వెనుక బీజేపీ నాయకత్వం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెల్చుకున్న తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం , తెలంగాణ పై ఫోకస్ చేసింది . ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి పెద్ద ఎత్తున ఆహ్వానించడం ద్వారా రాష్ట్రం లో బలపడాలని చూస్తోంది .
దానిలో భాగంగానే కాంగ్రెస్ , టీడీపీ లకు చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంది . అయితే అధికార పార్టీ నేతలు ఎవరు కూడా బీజేపీ లో చేరేందుకు సాహసించడం లేదు . కేసీఆర్ నాయకత్వాన్ని ఢీ కొట్టే సమర్ధుడైన నాయకుడు బీజేపీ లో లేకపోవడం వల్లే , అధికార పార్టీ నేతలు బీజేపీ లో చేరేందుకు వెనకడుతున్నట్లు తెలుస్తోంది. .