ఎన్నికల ముందు పాదయాత్రతో ఇచ్చిన ప్రతిహామీ అమలే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు . పాలనా పగ్గాలు చేపట్టిన వందరోజుల వ్యవధిలోనే ప్రజలకిచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి, తాజాగా ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందచేస్తామని చెప్పి , ఇప్పుడు అమలు చేశారు. ఈ మేరకు జగన్ సర్కార్ జీవో విడుదల చేయడం తో , ఆటో టాక్సీ డ్రైవర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి . నందిగామ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆటో టాక్సీ డ్రైవర్లు సంబరాలు జరుపుకున్నారు .
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలుపర్చడానికి సీఎం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు . రాష్ట్రంలోని ప్రతి కార్మికుడి ఇళ్లల్లో వెలుగులు నింపడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిలో భాగంగానే వెనుకబడిన వర్గాలకు , కుల వృత్తుల వారికీ ఇదే విధంగా సంవత్సరానికి ఒకసారి ఆర్థికచేయూత అందిఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ పథకానికి అర్హులైన ప్రతిఒక్కరు నేటి నుండి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని అయన సూచించారు. జగన్ పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల వారి కష్టాలను తెలుసుకుని , తాము అధికారం లోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల వారికి చేయూత నందిస్తామని పేర్కొన్నారు .
జగన్ మాటలను విశ్వసించిన ప్రజలు ఎన్నికల్లో వైకాపా ను భారీ మెజార్టీ గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు . ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ , తాను ప్రజలకిచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నారు . ఆశా వర్కర్ల జీతాల పెంపు , నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీల అందజేత వంటి కార్యక్రమాలు చేపట్టారు .