ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఎంచుకున్న వ్యూహంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. చలో ఆత్మకూరు పేరుతో ఆయన జగన్ ప్రభుత్వంపై దాడికి దిగారు. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని బాబు ప్రకటించడం మరింత ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు బనాయించి పోలీసులు వేధిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని బాబు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మకూరుకు వెళ్లి అక్కడ దళిత వాడల్లో ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
అయితే, అదే సమయంలో తాజాగా చంద్రబాబు వ్యూహం మార్చుకున్నారు. జగన్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. అయితే, ఇందులో తేల్చుకునేందుకు ఏముంటుంది ? అనేది ప్రధాన విషయం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పరిస్థితి దారుణంగా ఉన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు. 2014 నాటి పరిస్థితితో పోల్చుకుంటే.. ఇప్పటి పరిస్థితి సానుకూ లంగా ఉందని అంటున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం 100 రోజుల జగన్ ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకుంటానని కాలు దువ్వుతున్నారు.
వాస్తవం చెప్పాలంటే.. గత చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరినీ విమర్శలు కూడా చేయించనీయలేదు. పైగా కేసులు పెట్టించారు. ఇళ్లలోనే గృహ నిర్బంధాలు పెట్టారు. దీంతో పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తామన్న ప్రతిపక్షాలను తిట్టిపోశారు. ప్రత్యేక హోదా అడుగు తున్న వారు తనను ఎడ్యుకేట్ చేయాలన్నారు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉంటే.. ఎంత స్వేచ్ఛ కోరుకుంటున్నారో.. ఎదుటి వారు కూడా అంతే స్వేచ్ఛను కొరుకుంటారనే విషయాన్ని ఆయన ఇన్నాళ్లకు గ్రహించారని అంటున్నారు పరిశీలకులు .
ప్రతిపక్షంలో ఉండగా.. ధర్నాలు, నిరసనలు కామనే అయినా.. చంద్రబాబు వైఖరి మాత్రం వివాదాలకు తావిచ్చేలా.. ప్రభుత్వాన్ని సైతం డామినేట్ చేసేలా ఉండడం సమంజసం కాదని.... ఏదేమైనా అనుభవశాలి ఇలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.