ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని అమరావతిగా గత ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రాజధాని నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేసింది. కొన్ని నిర్మాణాలను చేపట్టింది. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇక అమరావతి బ్లూ ప్రింట్ కోసం రాజీపడకుండా తయారు చేయించింది. కోట్లాది రూపాయలు డిజైన్ కోసమే ఖర్చు చేశారు. దురదృష్టం ఏమిటంటే 2018 నాటికీ కనీయం 30శాతం మేర కూడా రాజధాని నిర్మాణం జరగకపోవడం. 2019 వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అమరావతి ఆగిపోయింది.
ఇప్పుడు అమరావతి నిర్మాణం విషయం డైలమాలో పడింది. అమరావతి నిర్మాణం జరుగుతుందా.. లేదా అన్నది అందరి మదిలో ఉన్న ఆలోచన. అమరావతి నిర్మాణం ముందుకు సాగే సూచనలు కనిపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఆగిపోయాయి. అమరావతికి వరద ముప్పు ఉందని, అక్కడ నిర్మిస్తే సేఫ్ కాదని వైకాపా ప్రభుత్వం చెప్తున్నది. పైగా అమరావతి నగరం నిర్మాణం చేయాలి అంటే భారీగా నిధులు కాలనీ, ఆ స్థాయిలో నిధులు ప్రభుత్వం దగ్గర లేవని అంటోంది.
ఇటు ఏపీ ఆర్ధిక శాఖామంత్రి బుగ్గిన చెప్పిన దాన్ని బట్టి కూడా అమరావతి నిర్మాణం ఇప్పటిలో జరిగేలా కనిపించడం లేదు. నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ప్రస్తుతం నిర్మాణం విషయం పక్కన పెట్టడంతో ఆయా దేశాలు పెట్టుబడుల విషయంలో ఆలోచనలో పడ్డాయి. అయితే అభివృద్ధి అన్నది ఒక్కచోట కాకుండా అన్ని చోట్ల జరగాలని అంటున్నారు వైకాపా నాయకులు. అంటే ఒక్కొక్కటి ఒక్కోచోట పెడతారా.. ఏమో కావొచ్చు.
ఇలా చేయడం వలన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. ఒకవేళ అలా చేయడం వలన భవిష్యత్తులో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎలా అంటే.. వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యాలయాలను నిర్మించడం వలన భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చు. ఒకచోట రక్షణ కల్పించడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అలనాటి వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తే.. వాటి రక్షణ పరిస్థితి ఏంటి అన్నది చూడాలి.