ఏపీలో మరో అదిరిపోయే ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. గత ఏడాది కాలంగా ఎన్నికల మూడ్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సమ్మర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల మూడ్ నుంచి బయటకు వచ్చి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఏపీలో ఎన్నికల జాతర త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఏపీలో వరుసపెట్టి ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారు. దీంతో పంచాయతీ నుంచి సహకార సంఘాలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, మండల, జిల్లా పరిషత్లు అన్ని ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గుతున్నాయి.
దీంతో స్థానిక సంస్థలకు లేకపోవడంతో జనరల్ బాడీలు లేకపోవడంతో పరిపాలన కుంటుపడుతోంది. ఈ క్రమంలోనే వరుస పెట్టి అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఏపీలో డిసెంబర్లో ఎన్నికలు జరుగుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిసెంబరులో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ముందుగా మున్సిపల్, నగర పంచాయతీ, కార్పొరేషన్ల ఎన్నికల నుంచి వరుస పెట్టి ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానుంది. ఏపీలో కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సమీప గ్రామాల విలీనానికి సంబంధించి చాలా చోట్ల కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరు - ఒంగోలు - విజయనగరం - శ్రీకాకుళం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగకుండా పెండింగ్లో ఉన్నాయి.
ఇక జగన్ ప్రభుత్వం వీటన్నిటికీ ఎన్నికలు జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికలు జరగని కార్పొరేషన్లకు కూడా త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే మండలాలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ వెంటనే సహాకార సంఘాలు, పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఘనవిజయంతో చంద్రబాబుపై కంప్లీట్గా పైచేయి సాధించారు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబును ఢీ కొట్టి ఎలా పై చేయి సాధిస్తారనేది ఆసక్తికరం.