ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు దొంగతనం చేసి ప్రజలకు ముఖం చూపించలేకనే ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి . ఎవరు దొంగతనం చేయమన్నారని , ఆత్మహత్య ఎవరు చేసుకోమన్నారని అయన ప్రశ్నించారు . కోడెల మృతి చెందడం బాధాకరం అంటూనే , అయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి . కోడెల శివప్రసాదరావు మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు .
సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని అయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తొలుత గుండెపోటు అన్నారని ...ఆ తరువాత ఆత్మహత్య అన్నారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు . కోడెల మృతికి అసలు కారణాలేమిటన్నది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు కోడెల ఒకవేళ గుండెపోటు వచ్చి ఉంటే నిమ్స్ , కేర్ ఆస్పత్రి, ఆపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కానీ బసవతారకం హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు . అది క్యాన్సర్ హాస్పిటల్ కదా ? అంటూ ఆయన ప్రశ్నించారు .
ప్రభుత్వం కేసులతో కోడెల శివప్రసాద్ రావును వేధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం కరెక్టు కాదన్న బొత్స , బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయన పై , కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎక్కడ కూడా ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కోడెల మృతిని రాజకీయం చేయడం కరెక్టు కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు .