గత కొద్దికాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా.. భారతీయ జనతా పార్టీ ‘ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది బడానేతలు ఆ పార్టీలో చేరారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అటు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ప్లాన్తో ఇప్పటి నుంచే దూసుకుపోతోంది. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలకు కూడా వలవేసి వారిని కూడా తమ వైపునకు తిప్పుకుంటోంది.
ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ తెలంగాణలో మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీజేపీ వాళ్లతో టచ్లో ఉన్నారు. ఇదిలా ఉంటే బీజేపీ ఇచ్చే ఆఫర్లతో.. చాలా మంది నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కమలం గూటికి చేరనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవయ్య ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు ఘోరంగా మారుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఎవరు ? బయటకు వస్తున్నారో ? తెలియని పరిస్థితి. సుద్దాల దేవయ్య ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని.. రెండు మూడు రోజుల్లోనే బీజేపీలో చేరే అవకాశాలున్నాయని సమాచారం.
ఇక బీజేపీ ఇతర పార్టీలకు చెందిన బడా నేతలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా భారీ ఆఫర్లతో వల వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీకి ఏ మాత్రం పట్టులేని ఖమ్మంతో పాటు . నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పలువురు ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.