ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డు సభ్యుల ఎంపిక జరిగింది. గతంలో 1 మందికే పరిమితమైన ఈ బోర్డు సభ్యులు.. ఇప్పుడు దీనికి జగన్ 24 మందికి చేశారు. అంతా బాగానే ఉంది. అయితే, బోర్డు సభ్యులను పెంచడంలోనే టీడీపీ శ్రేణులు విమర్శలు ప్రారంభించారు. జంబో బోర్డుగా అభివర్ణించారు. వాస్తవానికి బోర్డును ఏర్పాటు చేసినప్పుడు తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య, వారికి చేస్తున్న ఏర్పాట్ల సంఖ్య వాటిని పరిగణనలోకి తీసుకుని, సలహాలు,సంప్రదింపుల కోసం ఈ బోర్డును అప్పట్లో 19 మందితోనే ఏర్పాటు చేసి ఉండొచ్చు.
కానీ, ఇప్పుడు రోజులకు లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో బోర్డులో ఇంకా 19 మందే ఉంటారని, ఉండాలని చెప్పడంలో అర్ధం లేదు. మొత్తంగా బోర్డు సభ్యుల సంఖ్య విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైందేనని భావించవచ్చు. ఇకపోతే... తాజాగా బోర్డు సభ్యుల ఎంపిక విషయం కూడా టీడీపీ వివాదం చేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధికార ప్రతినిధులు కొందరు పసలేని విమర్శలు, పోసుగోలు కబుర్లతో మీడియాలో కనిపించేందుకు ఉత్సాహం చూపించారు.
బోర్డులోని మొత్తం సభ్యుల్లో ఏపీ నుంచి ఎనిమిది మందికి , తెలంగాణ నుంచి ఆరుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, ఢిల్లీ నుంచి ఇద్దరికి, కర్ణాటక నుంచి ఇద్దరికి జగన్ అవకాశం కల్పించారు. దీనిపైనే టీడీపీ ఇప్పుడు పసలేని విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారు 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని జగన్ చెబుతున్నారని, కానీ, టీటీడీలో మాత్రం ఆయన పొరుగు వారికి పెద్ద పీట వేశారని విమర్శించారు. జగన్ మడమ తిప్పారని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలు వింటే.. ఎంత రోత నేతలకైనా ఇంకా రోత అనిపించక మానదు. బోర్డు సభ్యులు అంటే ఇవి ఉద్యోగాలు కావు. వీటికి పర్మినెంట్ గుత్తాధిపత్యం ఏమీ ఉండదు. రెండేళ్ల తర్వాత మరో కొత్త బోర్డు వస్తుంది. పైగా తిరుమలకు సేవ చేసిన వారికి, తిరుమల అభివృద్ధికి దోహపడేవారికి ఛాన్స్ ఇస్తారు. దీనికే స్థానికతను ముడిపెట్టి మాట్లాడాలని టీడీపీ స్కెచ్ సిద్ధం చేసుకోవడం కుళ్లు రాజకీయమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.