ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత వరసగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు జగన్. ముందుగా యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో జగన్ ముందు ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకాన్ని పింఛన్ విధానంపై చేశారు. పింఛన్ ను పెంచు నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా పింఛన్ ను పెంచుతామని పేర్కొన్నారు.
దీంతోపాటు యువతకు హామీ ఇచ్చినట్టుగా 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అందులో భాగంగానే మొదట రెండున్నర లక్షల గ్రామ వాలంటీర్లను ఆగష్టు 15 వ తేదీన నియమించారు. వీరంతా గ్రామాల్లో పనిచేస్తారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్ ను నియమించారు. ప్రభుత్వ పధకాలు సరిగ్గా అందేలా చూస్తున్నారు. దీనితో పాటు గ్రామ సచివాలయ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడమే కాకుండా రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించారు.
ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2 వ తేదీన ఉద్యోగాల్లో చేరబోతున్నారు. గ్రామ సచివాలయంలో గ్రామానికి సంబంధించిన పనులను వారు నిర్వహించబోతున్నారు. ప్రభుత్వానికి.. గ్రామానికి వారధిగా వీరు పనిచేస్తారట. ఇక అప్పుల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశాయి. జగన్ ఆకాశానికి ఎత్తాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో మంటలు రేపింది.
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే.. తెలంగాణలో ఎందుకు చేయడంలేదని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుంటే సమ్మెకు దిగుతామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఇప్పుడే ఆలోచించేలా లేదు. దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటోందో తెలియదు. ఒకవేళ ఆలస్యం చేస్తే మాత్రం సమ్మెకు దిగుతామని స్పష్టం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.