హుజూర్నగర్ ఉప ఎన్నిక పీసీసీ ఛీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుని పరువు నిలుపుకోవాలని ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ తన అభ్యర్థిని ప్రకటించి, ప్రచారానికి సన్నదమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పై ఇంకా సందిగ్థం నెలకొంది. ఎలాగైనా తన భార్య పద్మావతిరెడ్డికి టికెట్ దక్కించుకోడానికి ఉత్తమ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
ఈక్రమంలోనే ఆదివారం ఆయన ముఖ్దూం భవవన్కి వెళ్లి సీపీఐ నాయకులతో సమావేశం అయ్యారు. సాయంత్రం కోదండరాం ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయితే పార్టీలో చర్చించిన తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆయా పార్టీల నేతలు చెప్పినట్లు సమాచారం. అయితే కనీసం అనుచరులకు, నేతలకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఆయన ఇతర పార్టీల కార్యాలయాలు చుట్టూ తిరుగుతుండటంపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హుజూర్నగర్ శాసనసభ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది. 24న ఫలితాలను ప్రకటించ నున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. షెడ్యూల్ విడులైన వెంటనే టీఆర్ ఎస్ తన పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా పద్మావతి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉత్తమ్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.
అంతేగాక తన అనుచరుడు కిరణ్రెడ్డికే టికెట్ ఇవ్వాలని రేవంత్ హైకమాండ్ వద్ద పట్టుబడున్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో రెబల్గా పోటీకి దించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అభ్యర్థిగా కి రణ్రెడ్డిని ప్రకటించిన రేవంత్.. తన మద్దతుదారుడి కోసం హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నట్లు సమాచారం. దీంతో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ బెంబేలెత్తుతున్నారు. నిన్నటి దాకా రాజీ ఫార్ములాను అనుసరించిన ఆయన తాజాగా ఇతర పార్టీల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.