తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ తర్వాత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నాయకుల అలకలు, బుజ్జగింపులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రోజుకో కొత్త మలుపు తిరుగున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి అలకలు కాస్త చల్లారాయనుకుంటున్న టైంలోనే మరో గొడవ తెరమీదకు వచ్చింది. జిల్లాకు చెందిన సీనియర్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ఆయన కూతురు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితల వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.
తన ప్రత్యర్థి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అనూహ్యంగా మంత్రి పదవి ద క్కించుకోవడాన్ని రెడ్యానాయక్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తండ్రీ కూతుళ్లు ఇద్దరూ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తానే సీనియర్ నని, తనకు కాకుండా, రాజకీయ ప్రత్యర్థి అయిన సత్యవతి రాథోడ్కు ఎలా మంత్రి పదవి ఇస్తారని ఆయన ప్రశ్నించడం పార్టీలో కలకలం రేపింది. ఇక కొద్ది రోజుల క్రితమే రెడ్యానాయక్ కుమార్తె మానుకోట ఎంపీ మాలోత్ కవిత బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరిగింది.
ఇక ఇప్పుడు రెడ్యానాయక్కు మంత్రి పదవి రాకపోవడంతో ఈ తండ్రికూతుళ్లు ఇద్దరు రగిలిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సీనియర్ ఎమ్మెల్యే సోమవారం తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఇప్పటికే నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచాక సీనియార్టీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశిచారు.
అయితే కేసీఆర్ సామాజికవర్గానికే చెందిన ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఇటీవలే కేసీఆర్ ఆయన్ను పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యునిగా ఇటీవల విద్యాసాగర్ను నియమించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ తనకు ఎలాంటి ప్రాధాన్యత లేదని పదవి ఇచ్చారని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏదేమైనా గులాబీ కోటలో అసమ్మతి జ్వాలలు మాత్రం ఆగడం లేదు.