కాంగ్రెస్ పార్టీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ముగ్గురు నేతలు చక్రం తిప్పారు. తిరుగులేని నేతలుగా పేరు తెచ్చుకున్నారు. వారిలో ఒకరు కొణతాల రామకృష్ణ. ఈయన వ్యూహాలు అద్భుతంగా ఉంటాయని.. వ్యూహం రచిస్తే జరిగి తీరాల్సిందే అనే పేరు ఉన్నది. పైగా అప్పటి కాంగ్రెస్ రాజకీయాల్లో అవినీతికి దూరంగా ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈయన, 2014లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి వైకాపాలో జాయిన్ అయ్యారు.
వైకాపాలో చేరిన తరువాత కొన్నాళ్ళు పార్టీలోనే ఉన్నారు. పార్టీలో ఉన్నప్పటికీ అయన వైకాపాకు అంటీఅంటనట్టుగా ఉంటున్నారు. కారణం పార్టీలో ఆయనకు తగిన గుర్తింపు లభించకపోవడమే. దీంతో అయన వైకాపాలో ఉన్నా .. అసలు అయన పార్టీలో ఉన్నాడా అనే డౌట్ కలుగుతుంది. ఇదిలా ఉంటె ఇదే కోవలో దాడి వీరభద్ర రావు పరిస్థితి కూడా మారిపోయింది.
గతంలో టీడీపీలో ఉండగా.. 2014 ఎన్నికలకు ముందు ఇంకేముంది.. వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి ఆయన పార్టీ మారిపోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబును ఆడేసుకున్నారు. ఇక, ఈ అంచనా తల్లకిందులైంది. దీంతో ఆయన మళ్లీ మధ్యలో టీడీపీలో చేరిపోవాలని ప్రయత్నించారు.ఇంకా దీనికి సంబంధించిన చర్చలు సాగుతున్న క్రమంలోనే ఆయన పార్టీని వదులుకున్నారు. అయితే, ఏమైందో ఏమో టీడీపీలో చేరలేదు. మధ్యలో జనసేన అధినేత పవన్ స్వయంగా దాడి ఇంటికి వెళ్లారు. ఇంకేముంది పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగినా.. అది కూడా సక్సెస్ కాలేదు. సరే ఎన్నికలకు ముందు జగన్కు మళ్లీ జై కొట్టారు. వైసీపీలో చేరిపోయారు. కానీ, ఏమీ ఆశించింది జరగలేదు. దీంతో అయన సైలెంట్ గా ఉండిపోయారు.
ఈయనతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ గతంలో అమలాపురం నుంచి ఎంపీగా కాంగ్రెస్ హయాంలో గెలిచిన ఆయన తర్వాత రాష్ట్ర విభజనతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. టిడిపిలో జాయిన్ అవుతారని అనుకున్నారు. ఎలాగోలా టిడిపిలో జాయిన్ అయ్యి.. అమలాపురం ఎంపీ సీటును ఆశించారు. కానీ, టిడిపి హర్షకుమార్ కు కాకుండా బాలయోగి కుమారుడికి ఆ టికెట్ కేటాయించింది. దీంతో అనుకున్న టికెట్ రాకపోవడంతో పార్టీ నుంచి హర్షకుమార్ బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ సీనియర్ నేతలను పిలిచేవారు లేరు. పట్టించుకునే వ్యక్తులు లేరు. వీరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది.