దేశంలో మార్పు రావాలి అంటే ముందు నాయకుల ఆలోచనలో మార్పు రావాలి. అభివృద్ధి అంటే కేవలం మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించాలి. అధికారుల్లో చలనం తీసుకొచ్చి.. పనులు చకచకా జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకున్నప్పుడే పనులు సక్రమంగా పూర్తవుతాయి. పనులు పూర్తయితే.. అన్ని అనుకున్నట్టుగా సర్దుకుంటాయి. అలా జరిగితేనే అన్నింటా వృద్ధి కనిపిస్తుంది. లేదంటే అభివృద్ధి శూన్యత కనిపిస్తుంది.
మోడీ మాటల మనిషి కాదు చేతల మనిషి అని మరోమారు నిరూపించారు. కాశ్మీర్ విషయంలో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత 72 సంవత్సరాలుగా సాధ్యంగాని విషయాన్ని మోడీ కేవలం 72 రోజుల్లో తేల్చేశారు. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. అప్పట్లో మరో పెద్దపార్టీ లేదు. కానీ, ఆమె అప్పట్లో సహాయం చేయలేకపోయింది. కారణం ఓటుబ్యాంకు రాజకీయం.
అప్పుడే చేసి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ గతి పట్టేది కాదు. అలానే, రాజీవ్ గాంధీ హయంలో కూడా మరోసారి అవకాశం వచ్చింది కానీ, అప్పుడు వినియోగించుకోలేదు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీతో నెగ్గుకొస్తోంది. కానీ, 2019లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో ఆ అవకాశాన్ని పోగొట్టుకొకూడదు అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆర్టికల్ 370 ని రద్దు చేశారు. రాజ్యసభలో సరైన మెజారిటీ లేకున్నా సభ్యులు ఆమోదించాల్సి పరిస్థితి వచ్చింది. అప్పట్లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలి అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత దాన్ని రద్దు చేసిన బీజేపీని వ్యతిరేకించింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది బయట నుంచి మద్దతు తెలిపారు. అలానే హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో కూడా మోడీ చేసిన ప్రసంగం అద్భుతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం మరో విశేషం. ఇండియా దౌత్య నీతికి ఇదొక నిదర్శనం. మోడీ దౌత్యపరమైన విధానాన్ని కాంగ్రెస్ నేతలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇందులో మిలింద్ డియారా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మిలింద్ డియారా మోడీని పొగుడుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ నేతలు మోడీని పొగుడుతుంటే.. పాపం ఆ పార్టీ అధినాయకత్వానికి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.