సుప్రీం కోర్టు ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయోధ్య కేసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 18 వ తేదీలోపుగా వాదనలు పూర్తి చేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 18 తరువాత ఒక్కరోజు కూడా వాదనలు వినబోమని స్పష్టం చేసింది. అందుకోసమే ప్రతి రోజు అయోధ్యకేసును వింటున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. అక్టోబర్ 18 లోపు వాదనలు ముగిస్తే.. నెల రోజుల లోపు తీర్పును వెలువరిస్తారు.
నవంబర్ 17 వ తేదీతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి పదవీకాలం ముగుస్తుంది. ఈలోపుగా తీర్పును వెలువరించాలని అయన పట్టుబడుతున్నారు. ఒకవేళ అలా జరగని పక్షంలో కొత్త చీఫ్ జస్టిస్ మరలా వాదనలు వినాల్సి వస్తుంది. ఇప్పటికే అయోధ్య వివాదంలో హిందూ ముస్లింల సమస్యలు జటిలం అవుతున్నాయి. ఈ కారణంగా దేశంలో మతవివాదాలు చెలరేగుతున్నాయి.
దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, మరో నాలుగైదు రోజుల్లో తమ వాదనలు పూర్తి చేస్తామని ఇప్పటికే అయోధ్య కేసులో వాదనలు వినిపిస్తున్న హిందూ న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా, తమ వాదనలు వినిపించడానికి మరో గంట అదనపు సమయం కేటాయించాలని ముస్లిం న్యాయవాదులు కోరుతున్నారు. అందుకు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది.
1992 డిసెంబర్ 6 వ తేదీన జరిగిన బాబ్రీ మజీద్ కూల్చివేత తరువాత దేశంలో హిందూ ముస్లింల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోయాయి. కాగా, ఇటీవల కాలంలో ఈ గొడవలు దాదాపుగా సమసిపోయాయి. ఇప్పుడు అందరి చూపులు అభివృద్ధివైపు ఉన్నది. అటు ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లోని ముస్లింలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో అయోధ్య కేసుకు సంబంధించిన తుది తీర్పు మరో నెలరోజుల్లో రాబోతున్నది అని తెలిసిన వెంటనే.. ప్రతి ఒక్కరు దానివైపు చూస్తున్నారు.