చంద్రబాబు గిరిజనుల సంపదను దోచుకోవాలని చూశారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. ఆమే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2015లో చంద్రబాబు ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ పోరాడారని గుర్తు చేశారు. గిరిజనులకు బాక్సైట్ తవ్వకాలతో తీవ్ర నష్టం జరుగుతుందని గ్రహించిన జగన్ తాను అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తానని మాట ఇచ్చారని, గిరిజనులకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని ఆమె అన్నారు. గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని పుష్ప శ్రీవాణి అన్నారు.
సీఎంగా చంద్రబాబు నాయుడు 2015లో ఆగస్టు 9 ఆదివాసి దినోత్సవం రోజునే జీవో 95 ని విడుదల చేసి గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. ఆనాడు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఎన్నిచెప్పినా వినకుండా కేవలం బాక్సైట్ నిక్షేపాలను కొల్లగొట్టి గిరిజన బతుకుల్లో చితి పేర్చాలని చూసాడని గిరిజన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆరోపించారు. అయితే ఆనాడు చింతపల్లిలో జరిగిన సభలోనే బాక్సైట్ తవ్వకాలను ఆపేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ ప్రకటించారు.
గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి తన మాటను నిలబెట్టుకున్నాడని ఆమె అన్నారు. గిరిజన ప్రజల మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన బాక్సైట్ నిధుల తవ్వకాలను ఆపేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆమే తెలిపారు. సీఎం జగన్ గిరిజనుల పక్షం వహించి బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయడంతో గిరిజనులంతా జగన్గారికి రుణపడి ఉంటారని అన్నారు.
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలతో గిరిజనుల ఉనికికే ప్రమాదం ఏర్పడి తరుణంలో సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రాభివృద్ధిలో అధిక రాబడి వచ్చే ఈ బాక్సైట్ తవ్వకాలను ఆపితే భారీ ఖజానాకు గండి పడుతుంది. అయినా ఖజానా కన్నా గిరిజనుల శ్రేయస్సే ముఖ్యమని నమ్మిన సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక సీఎం స్థాయిలో రాష్ట్ర ఖజానాకు గండి పడుతున్నా గిరిజన ప్రజలే ముఖ్యమని ఓ కీలక నిర్ణయం తీసుకుని గిరిజన ప్రజలకు సీఎం ఆరాధ్య దైవం అయ్యాడు.