రాయలసీమ రాయలు ఏలిన సీమ రతనాల సీమ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్ని త్యాగాలు చేసినా .. ఆ సీమపై ప్రభుత్వాలకు కనికరం లేదు. అయితే, సీమ నుంచే ముఖ్యమంత్రులు వస్తున్నారు కానీ, సీమకు చేసింది ఏమిలేదు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ పై దృష్టి పెట్టారు. అటు వైఎస్ హయాంలో కూడా హైదరాబాద్ మీదనే ఎక్కువ దృష్టి సారించారు. ఇప్పుడు జగన్ హయాంలో అభివృద్ధి ఎక్కడ చేస్తారో ఇంకా స్పష్టం కావడం లేదు.
అమరావతి పేరుతొ గత ప్రభుత్వంగుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసింది. అన్నింటికీ మధ్యలో ఉన్నది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ, హైకోర్ట్, సెక్రెటరియేట్ వంటివి నిర్మించారు. అవి తాత్కాలిక భావనలని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆరేళ్ళు అయ్యింది. ఇప్పటికీ ఇంకా రాజధానికి గురించి సరైన నిర్ణయం లేదు.
వైకాపా ప్రభుత్వం రాజధానిని మారుస్తారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజం లేదని చెప్తున్నా పరిణామాలు మాత్రం అలానే కనిపిస్తున్నాయి. ఒకవేళ మారిస్తే ఎక్కడికి మారుస్తారు అన్నది కూడా తెలియడం లేదు. అయితే, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అమరావతిలో నిర్మించింది తాత్కాలిక హైకోర్టు కాబట్టి.. పూర్తి స్థాయిలో ఉండే హై కోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఒకవేళ ఇది నిజమైతే కొంతమేర అక్కడ అభివృద్ధి చెందినట్టే అవుతుంది. కోర్టుకు వచ్చే కేసుల్లో ఎక్కువగా ఆ ప్రాంతం నుంచే ఉంటాయి కాబట్టి అక్కడ కోర్టు ను ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. అయితే, అక్కడ ఏర్పాటు చేస్తారా లేదంటే కేవలం మాటలు చెప్పి ఊరుకుంటారా అన్నది తెలియాలి. ఏది ఏమైనా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా ప్రదేశాలు మార్చకుండా ఒక చోట స్థిరంగా ఉంటె బాగుంటుంది. ఎదో ఒకటి త్వరగా తెలిస్తే అందరికి మంచిదే కదా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని అందరు కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.