రాజధాని గుంటూరు జిల్లాలో టీడీపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇటీవల ఎన్నికలు జరగకముందు వరకు ఇక్కడి నియోజ కవర్గాల్లో టీడీపీ హవా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంకేముంది.. టీడీపీకి మళ్లీ తిరుగులేదని, పార్టీ మరోసారి జయకేతనం ఎగుర వేయడం ఖాయమని భావించారు తమ్ముళ్లు. ముఖ్యంగా రాజధాని ఏర్పాటుతో గుంటూరు జిల్లాలో టీడీపీ బూమ్ పెరిగిందని ప్రతి ఒక్కరూ భావించారు. కమ్మ వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు కూడా ఈ పార్టీకి అండగానే ఉన్నారని అనుకున్నారు.
తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ప్లేట్ తిరగబడింది. కేవలం ఇద్దరు మాత్రమే ఈ అతి పెద్ద జిల్లాలో విజయం సాధించారు. మిగిలిన జిల్లా వ్యాప్తంగా వైసీపీ పుంజుకుంది. నిజానికి రాజధానిని వ్యతిరేకించిన వైసీపీకి ఇక్కడ ఉన్న సీట్లు కూడా పోతాయని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ వైసీపీ ఇంతింతై.. అన్నట్టుగా పుంజుకుంది. ఇప్పుడు మరింతగా పునాదులు బలం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మరి ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి ఏంటి? నాయకులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. దీనిని పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
నియోజకవర్గానికి ఓ సమస్యతో మాజీలు అల్లాడిపోతున్నారు. గుంటూరులోని ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలకు వ్యాపారాలు ఉన్నాయి.ఎవరికి వారు తమ వ్యాపారాల్లోను, వ్యవహారాల్లోనూ మునిగిపోయారు. కొందరు పాల వ్యాపారంలో తలమునకలైతే.. మరికొందరు అక్రమ గనుల వ్యాపారాల్లోనూ ఉన్నారు. ఇంకొందరు విదేశాల నుంచి తమ స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించే పనిలో మునిగిపోయారు. దీంతో ఇప్పుడు వీరంతా ఓటమి పాలవడంతో ప్రభుత్వంపై నేరుగా టీడీపీ వాణిని వినిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరికి వారు తమ సొంత వ్యవహారాల్లో మునిగిపోవడం, గతంలో చేసిన అక్రమాలకు తాలూకు కేసులు ఉండడంతో నాయకులు పెదవి విప్పడం లేదు.
జగన్ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆందోళనలకు, నిరసనలకు కూడా కలిసిరావడం లేదు. అంతేకాదు, కేడర్లో ఉత్సాహం నింపే పనులు కూడా చేపట్టడం లేదు. దీంతో అత్యంత కీలకమైన రాజధాని గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇక, గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారదామా.. ? ఉందామా..? అని ఊగిసలాడుతున్నారు. ఇక, మరో ఎంపీ.. తన వ్యాపారాల్లో మునిగిపోయినియోజకవర్గాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీని ఎవరు చక్కదిద్దుతారో తెలియక కేడర్ తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.