హుజూర్నగర్లో రాజకీయం రక్తి కడుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు రోజురోజుకూ ఆసక్తికర మలుపు తి రుగుతోంది. టీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ , టీటీడీపీతో పాటు ఇంటి పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగుతుండటంతో పొలిటికల్ పెరిగిపోయింది. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్కు మధ్య ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇతర పార్టీలకు పడే ఓట్లు కాంగ్రెస్, టీఆర్ఎస్లలో ఎవరికి నష్టం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
హుజూర్నగర్లో రెడ్డి, లంబాడీ, ఎస్సీ (మాదిగ), గౌడ్, యాదవ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. దీంతో ఆయా వర్గాలను టార్గెట్ చేసుకుని, రాజకీయ వర్గాలు పావులు కదుపతున్నాయి. మొత్తంగా ఈ వర్గాల ఓటర్లు 80 వేలకుపైగా ఉన్న ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల ప్రజలు ఎటు మొగ్గు చూపితే అటే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఈనేపథ్యంలోనే బీసీ ఓట్లను పొందేందుకు టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతీ ఒక్క ఓటు కీలకం కానుండటంతో ఇతర పార్టీలతో తమకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో పలు పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థులు ఖరారు అయ్యారు. అభ్యర్థులు ఎవరో తేలడంతో నేడు హుజూర్నగర్లో నామినేషన్ల కోలాహలం నెలకొననుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ, టీటీడీపీ, సీపీఎంలు తమ పార్టీ అభ్యర్థులను ఆదివారం అధికారికంగా ప్రకటించాయి. బీజేపీ నుంచి కోట రామారావు, సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్రావు, టీటీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయిలను ఆయా పార్టీలు ప్రకటించాయి. ఇక తెలంగాణ ఇంటి పార్టీ బలపరిచిన స్వంతంత్య్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగారు.
రేసులో ఎంత మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ఉంటున్నది స్పష్టం. ఈ క్రమంలోనే ఇక్కడ టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్లు ఎవరికి మైనస్ అవుతాయి... ఎవరికి ప్లస్ అవుతాయనేది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. దీంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ వాతావరణం ఉంది.